ఆస్ట్రేలియా టూర్లో భారత్ అదరగొట్టింది. అభిమానుల ఉత్కంఠకు తెరలేపింది. ముందు 1-1తో సమంగా ఉన్న రెండు టీంల చివరి మ్యాచ్పై ఆద్యంతం ఓ డ్రామాగా సాగింది. మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో చెలరేగి ఆడిన ధోనీ.. ఇండియాకు సిరీస్ అందించాడు. ధోనీ, జాదవ్ అండతో ఆస్ట్రేలియా నిర్దేశించిన 231 పరుగుల విజయలక్ష్యాన్ని 49.2 ఓవర్లలో ఇండియా ఛేదించింది. తద్వారా వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా.. ఆస్ట్రేలియాను బ్యాటింగుకు పంపింది. దిగిన ఆస్ట్రేలియా 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. కోంబ్ 58 పరుగులు చేసి తన వన్డే కెరీర్ లో మరో అర్ధ శతకం సాధించాడు. క్యారీ 5, ఫించ్ 14, ఖజావా 34, షాన్ మార్ష్ 39, స్టోయినిస్ 10, మ్యాక్స్ వెల్ 26, రిచర్డ్ సన్ 16, జంపా 8, సిడిల్ 10, స్టాన్ లేక్ 0 (డకౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్ చాహల్ తన అద్భుతమైన బంతులతో ఆసీస్ వెన్ను విరిచాడు. 10 ఓవర్లలో 42 పరుగులిచ్చి 6 వికెట్లను కూల్చాడు. భువనేశ్వర్ కుమార్, షమీ చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా 230 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆదిలోనే షాక్ తగిలింది. జట్టు స్కోరు 15 పరుగులు ఉన్నప్పుడు డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. అనంతరం ధావన్ (23), కోహ్లీ (46) ఔటయ్యారు. ఈ క్రమంలో 113 పరుగులకే (30 ఓవర్లు) మూడు కీలకమైన వికెట్లను ఇండియా కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే అద్భుతమైన ఆటతీరుతో జాదవ్తో కలసి ధోనీ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. 114 బంతులను ఎదుర్కొన్న ధోనీ 6 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేశాడు. జాదవ్ 57 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 61 పరుగులు చేసి సత్తా చాటాడు. కాగా.. చాహల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ధోనీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నారు.