యంగ్ హీరో వరుణ్ తేజ్ మరో కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నారు. ‘అంతరిక్షం’ సినిమా తర్వాత వరుణ్ చేయబోయే కొత్త చిత్రం ‘వాల్మీకీ’. హరీష్ శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు. తమిళంలో హిట్ అయిన ‘జిగడ్తాండ’కి రీమేక్ ఇది. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. ఆదివారం హైదరాబాద్లో ఫిల్మింనగర్ టెంపుల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుకుమార్, వినాయక్, తదితరులు హాజరయ్యారు. కొణదెల నిహారిక మొదట సన్నివేశానికి క్లాప్నిచ్చారు. వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఆనాటి వాల్మీకి రామాయణం రాశాడు. రామ చరితను రసరమ్యంగా తీర్చి దిద్దాడు. ఇప్పుడు మరో వాల్మీకి బయల్దేరాడు. మరి ఈ నయా వాల్మీకి ఏం చేశాడు? ఎవరి చరితను రాశాడో తెలియాలంటే మా సినిమా చూడండి అంటున్నారు హరీష్ శంకర్. ‘‘స్క్రిప్టు పక్కాగా సిద్ధమైంది. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ స్టార్ట్ చేస్తాం. మిగిలిన నటీనటుల వివరాలు కొద్దిరోజుల్లో వెల్లడిస్తామ’’ని చిత్రబృందం తెలిపింది. దేవీశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు.