ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. వివిధ జాతీయ పార్టీలు ఆయన దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ఎస్పీ నేత ములాయం, టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్, శరద్ యాదవ్ తదితరులు దీక్షకు మద్దతు పలికారు. ఏపీ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. ఎవరేమన్నారంటే..
రాహుల్
ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ఇచ్చిన మాటకు కట్టుబడాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ ప్రధాని మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు. ఏపీ ప్రజలకిచ్చిన హామీలను ఆయన విస్మరించారన్నారు. ఏపీ ఈ దేశంలో భాగం కాదా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని పెడచెవిన పెట్టారని దుయ్యబట్టారు. ప్రధాని ఎక్కడికి వెళితే అక్కడి పాట పాడతారని ధ్వజమెత్తారు. ఏపీకి వెళ్తే హోదా ఇవ్వకుండా అబద్ధాలు చెబుతారని విమర్శించారు. ప్రధాని మోదీకి విశ్వసనీయత లేదని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. ఏపీ ప్రజల సొమ్మును దోచి అంబానీకి కట్టబెట్టారన్నారు. ఏపీ ప్రజలకు అండగా ఉంటామని మరోసారి హామీ ఇచ్చారు.
మన్మోహన్
‘‘భారత ప్రభుత్వం ఏపీకి పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చింది. ప్రత్యేక హోదా హామీ కూడా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిందే. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. ప్రత్యేక హోదా సాధించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కృషికి అందరం సహకరిస్తాం.’’
ఫరూక్
‘‘పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే. ధర్మం
తప్పినప్పుడే ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది. అందుకే ఆంధ్రా ప్రజలు ఇక్కడికి వరకు వచ్చారు. ఓట్ల కోసం ప్రజలను కులాలు, మతాలను విభజించి కేంద్రం పాలించాలని చూస్తోంది. దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం పోవాలి. వ్యక్తిగత దూషణల స్థాయికి ప్రధాని దిగజారకూడదు. ప్రధాని అన్న వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి.’’
ములాయం
‘‘ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. చంద్రబాబు వెంట మేమంతా ఉంటాం. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా ఎస్పీ ఆయన వెంటన నడుస్తోంది. చంద్రబాబు వెంట రైతులు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. వారు న్యాయం కోసం పోరాడతారు. అవసరమైతే తిరగబడతారు.’’
ఒబ్రెయిన్
‘‘పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. దానిపై ప్రధాని మోదీ ఒక్క మాట మాట్లాడరు. మోదీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం గద్దె దిగే సమయం ఆసన్నమైంది. మోదీ, అమిత్ షా ఇద్దరూ దేశ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. తన ప్రసంగాల్లో మోదీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ దేశానికి మోదీ చేసిందేమీ లేదు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను ఆయన నిర్వీర్యం చేస్తున్నారు.’’
శరద్ పవార్
ఏపీ ప్రజల ధర్మ పోరాట దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాం. దేశం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రైతులు, నిరుద్యోగులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రధానమంత్రి ప్రతిపక్షాల ఐక్యతను ప్రశ్నిస్తున్నారు. ఎమర్జెన్సీ హయాంలో కూడా ఇలాగే అన్ని పక్షాలు ఏకమయ్యాయి. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదలో పడింది. అందుకే విపక్షాలు ఏకమవుతున్నాయి. కోల్కతాలో మమతకు ఇలాంటి సంఘీభావమే తెలిపాం. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరం ఏపీ విభజన హామీలు నెరవేర్చే వరకు అండగా ఉంటామని శరద్ యాదవ్ స్పష్టం చేశారు.