రక్షణ రంగానికి సంబంధించి అతి సున్నితమైన రాఫెల్ డీల్ విషయంలో… నరేంద్రమోడీ ప్రత్యక్ష ప్రమేయం ఉందనడానికి రోజుకో ఆధారం బయటకు వస్తోంది. గత వారం అసలు రాఫెల్ డీల్ను మానిటరింగ్ చేసేందుకు ఏర్పాటైన రక్షణ శాఖ కమిటీని కూడా కాదని నేరుగా ఫ్రాన్స్తో… ప్రధానమంత్రి కార్యాలయం సంప్రదింపులు జరిగిన విషయాన్ని ఇంగ్లిష్ దినపత్రిక ది హిందూ బయటపెట్టింది. ఈ రోజు ఆ డీల్ విషయంలో అవినీతి నిరోధకానికి సంబంధించిన ఓ క్లాజ్ను పూర్తిగా తొలగించాలన్న విషయాన్ని కూడా బయటపెట్టింది.
రక్షణ శాఖకు చెందిన కొనుగోళ్లలో అవినీతిని నిరోధించడానికి ప్రత్యేకంగా ఓ క్లాజ్ తప్పని సరిగా ఉంటుంది. ఈ వ్యవహారాల్లో అవినీతి జరిగితే శిక్షించడానికి ఈ క్లాజ్ అవకాశం కల్పిస్తుంది. కానీ మోడీ ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాలు సప్లయ్ చేసే దసోతో ఒప్పందం చేసుకునే ముందే ఈ క్లాజ్ తొలగించింది. దీంతో దసోతో చేసుకున్న ఒప్పందంలో ఈ క్లాజ్ లేదు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాఫెల్ డీల్కు సంబంధించి ఏ ఒక్క విషయాన్ని కూడా బయటపెట్టడం లేదు. అంతా సీక్రెట్గా వ్యవహరిస్తున్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన ఎన్నో మినహాయింపులను రఫెల్ డీల్ ఒప్పందంలో ఇచ్చారు. తాజాగా ఆ ఒప్పందంపై అవినీతి మరకలు పడినప్పటికీ అవేమీ చట్ట పరిధిలోకి రావన్నట్లుగా విచారణ జరపడానికి అవకాశం లేదన్నట్లుగా మినహాయింపు ఇవ్వడం కలకలం రేపుతోంది.
కాగా, ఇదంతా తన మిత్రుడు అనిల్ అంబానీ కోసమే చేశారని తేలిపోయిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. దోచుకోవడానికి నరేంద్రమోడీ ఎంతగా అవకాశం కల్పించారో ఈ క్లాజ్కు మినహాయింపుతోనే తేలిపోతోందని రాహుల్ గాంధీ చంద్రబాబు దీక్షకు సంఘిభావం తెలిపిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇలా రాఫెల్ స్కాంకు సంబంధించి ఒక్కో అంశం బయటకు వస్తూండటం దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి బీజేపీ కానీ మోడీ కానీ సమర్థవంతమైన వాదనలు వినిపించలేకపోతున్నారు. దేశ భక్తి పేరుతో ఎదురుదాడి చేస్తున్నారు కానీ అసలు నిజాలేమిటో మాత్రం చెప్పడానికి ముందుకు రాలేకపోతండటంతో బీజేపీ భారీ అవినీతికి పాల్పడినట్లుగా ప్రజల్లోకి వెళ్లిపోతోంది.