న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో రోహిత్ సేన తడపడింది. టీంఇండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్(1)తో దారుణంగా విఫలమయ్యాడు. ధోని (39), ధావన్(29), విజయ్ శంకర్(27), కృనాల్(20)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో భారత్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. భారత బ్యాట్స్మెన్ కనీసం క్రీజులో నిలదొక్కుకోవడానికి నానాతంటాలు పడడంతో భారత్ 139 పరుగులకే ఆలౌటైంది. దీంతో 80 పరుగుల తేడాతో రోహిత్ సేన ఘోర పరాజయంతో నిరాశ పరిచింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ మూడు వికెట్లు పడగొట్టగా, ఫెర్గుసన్, సాన్ట్నర్, ఇష్ సోధీ తలో రెండు వికెట్లు పడగొట్టగా మిచెల్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.
అంతకముందు టాస్ ఒడి బ్యాటింగ్ ఆరంభించిన కివీస్ ఆది నుంచి ధాటిగా ఆడింది. కివీస్ బ్యాట్స్మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో వారి దూకుడును భారత బౌలర్లు అడ్డుకోలేక చేతులెత్తేశారు. కివీస్ ఓపెనర్ సీఫ్రెట్ (84: 43 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు)లతో చెలరేగిపోయాడు.. అటు కొలిన్ మున్రో(34: 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు)లతో , విలియమ్సన్ (34: 22 బంతుల్లో 3 సిక్సర్లు)లతో భారత బౌలర్లకు చెమటలు పట్టించారు. చివర్లో స్కాట్ కుగ్లీన్ 7 బంతుల్లో 20 పరుగులు చేయడంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల భారీ స్కోరును చేయగలిగింది.