తమ్ముళ్లు మన మీద నమ్మకం వల్లే..!

ఒకే రోజు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత తమదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలోని బోగోలులో నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రెండు రోజుల క్రితం ఇక్కడికి సమీపంలోని రామాయపట్నం పోర్ట్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశామని, నాలుగు వేల ఐదువందల కోట్ల రూపాయలతో ఏర్పాటు కాబోయే ఈ పోర్టు రాబోయే రెండేళ్లలో అందుబాటులోకొస్తుందని చెప్పారు.

అదే రోజున, ఇండోనేషియాకు చెందిన పేపర్ మిల్స్ సంస్థ ఇక్కడ కాగితపు పరిశ్రమ ఏర్పాటుకు పునాది వేసిందని గుర్తుచేశారు. ఈ పరిశ్రమను రూ.24 వేల కోట్లతో ఏర్పాటు చేయనున్నారని, దేశంలో ఇప్పటి దాకా వచ్చిన అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డీఐ) ఇదేనని సంతోషం వ్యక్తం చేశారు. తన విధానం చూసిన అదానీ కూడా అదేరోజున వచ్చారని, రూ.70 వేల కోట్ల రూపాయలతో డేటా సెంటర్, దానికి అవసరమైన విద్యుత్ నిమిత్తం సోలార్ ఎనర్జీ సెంటర్ కు శ్రీకారం చుట్టారని, అంటే, ఒకే రోజు..లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, తద్వారా లక్షా ముప్పై వేల ఉద్యోగాలు లభిస్తాయని చంద్రబాబు తెలిపారు. ‘తమ్ముళ్లూ, ఇది నమ్మకం ఉంటే జరిగిందా? లేక నమ్మకం లేకపోతే జరిగిందా?’ అని ప్రశ్నించారు.

ఒకవేళ వైసీపీ అధికారంలోకొస్తే కనుక జగన్ తనతో పాటు తమనూ జైలుకు తీసుకెళతారని పెట్టుబడిదారులు భయపడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. నెల్లూరు జిల్లాలోని బోగోలులో నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో పెట్టుబడులు పెట్టేవాళ్లు కూడా తప్పించుకుని పోతారని, ఎవరూ పెట్టుబడులు పెట్టరని, అది, వైసీపీ చరిత్ర అని ఘాటుగా విమర్శించారు.

చాలా మంది పారిశ్రామిక వేత్తలు తమ జీవితాలనే నాశనం చేసుకున్నారని, కొంత మంది అధికారులు వీళ్లు చెప్పిన మాటలు విని వాళ్లు కూడా జైలుకు పోయే పరిస్థితికి వచ్చిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీడీపీనే రావాలని ప్రజలు తమ సందేశాల ద్వారా తనకు తెలియజేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. నాశనమవుతున్న వ్యవస్థలను గాడిన పెట్టేందుకు, రాష్ట్రాభివృద్ధి జరగాలంటే ‘నేనే మళ్లీ రావాలి’ అని ప్రజలు తనకు మెస్సేజ్ లు పంపుతున్నారంటూ వాటిని చంద్రబాబు చదివి వినిపించారు. రాష్ట్రం పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి కాకూడదంటే టీడీపీనే మళ్లీ అధికారంలోకి రావాలని, ఈ విషయమై ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు కోరారు.

leave a reply