Breaking News

ఆంధ్రా వస్తాం.. అంతు చూస్తాం..!

డబ్బులు, మీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ విమర్శలు

హైదరాబాద్ లో నాలుగు బిల్డింగులు కట్టించిన చంద్రబాబుకే అంత ఉంటే.. అసాధ్యమనుకున్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు ఇంకెంత ఉండాలని.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును రాజకీయంగా అంతు చూస్తామని.. టీఆర్ఎస్ అధినేత కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రబాబుపై తన ఆగ్రహాన్ని తీవ్ర స్థాయిలో వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు ఎలా బుద్ధి చెప్పాలో కేసీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియకపోవచ్చని, చంద్రబాబు తన శక్తిని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని, డబ్బులు, మీడియా రెండింటినీ అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో కూడా చంద్రబాబును ఆయన పార్టీని తెలంగాణ సమాజం తరిమికొడుతుందనే విశ్వాసం తనకు ఉందని, కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, ఆ ఫ్రంట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో తమ పట్టు చూపెడతామని.. కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కాగా, టీడీపీ అధినేత చంద్రబాబుపై కేటీఆర్ ఒక్కసారిగా బెదిరింపు ధోరణిలో హెచ్చరికలు చేయడమనేది రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. తెలంగాణలో చంద్రబాబు మహాకూటమిలో చేరితే… ఏపీలో వచ్చే ఎన్నికల్లో విపక్ష పార్టీలకు టీఆర్ఎస్ సాయం చేస్తుందని, అక్కడ.. తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ప్రయత్నించడం ఖాయమని.. కొన్నాళ్లుగా ప్రచారం జరగుతోంది.

అయితే, టీఆర్ఎస్ నేతల నుంచి పరోక్షంగా ఇప్పటి వరకూ వచ్చిన ఇలాంటి విమర్శలను.. చంద్రబాబు లైట్ తీసుకున్నారు. మొదట్లో ప్రచారానికి దూరంగా ఉండాలనుకున్నారు. అయితే.. టీఆర్ఎస్ నేతలు పూర్తిగా చంద్రబాబును సెంటర్ పాయింట్ గా చేసి తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేస్తూండటంతో ఆయన ప్రచారానికి వచ్చారు. విడతల వారీగా టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు.

leave a reply