సీబీఐలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు, ఆలోక్కు మధ్య విభేదాలు తారస్థాయికి చేరడం, అధికారులు కూడా రెండు వర్గాలుగా విడిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ఇరువురి అధికారుల మధ్య నెలకొన్న పరిస్థితి సీబీఐ పరువు తీసేవిధంగా ఉందంటూ అక్టోబర్ 23న అర్ధరాత్రి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇద్దరు అధికారులనూ బలవంతంగా సెలవుపై పంపిస్తూ ఆదేశాలు జారీచేయడంతో పాటు సీబీఐలోనే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఎం. నాగేశ్వరారవును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
దాని కారణంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో బుధవారం మరోసారి సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆలోక్ను మళ్లీ తప్పిస్తూ కేంద్రం గురువారం సాయంత్రం నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆయనను ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేసింది. ఈ పరిణామాలతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై అగ్నిమాపక డీజీ బాధ్యతలు చేపట్టకుండానే ఉద్యోగానికి రాజీనామా చేశారు.
కాగా, తాను ఎలాంటి తప్పు చేయకపోయినా అక్రమంగా, అన్యాయంగా పదవి నుంచి తప్పించడంతో పాటు బలవంతంగా సెలవుపై పంపడాన్ని ఆలోక్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయన పిటిషన్పై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సీవీసీని నివేదిక కోరింది. ఈ పరిణామాలపై సీవీసీ సీల్డు కవర్లో నివేదికను అందజేసింది.
ఉన్నతస్థాయి ప్యానల్ ఏర్పాటు చేసి నియమనిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాల్సిన వ్యవస్థలో అర్ధరాత్రి పూట నిర్ణయాలు తగవంటూ సుప్రీం కోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిక్రీ రెండు రోజల పాటు చర్చించాక కేంద్రం నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నతస్థాయి ప్యానల్ ఇచ్చిన సూచనల ఆధారంగా ఆలోక్ను డైరెక్టర్ బాధ్యతల నుంచి మరోసారి తప్పిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు.
తాను ఎలాంటి తప్పులు చేయకపోయినా.. ఎవరో చేసిన ఆరోపణలకు తనను బలిచేశారనే ఉద్దేశంతో ఆయన అగ్నిమాపక డీజీగా బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే కొత్త బాధ్యతలు స్వీకరించకుండా పదవీ విరమణ చేస్తున్నట్టు కేంద్రానికి సమాచారం పంపారు. అలాగే, ఆలోక్ ఇటీవల ఏడుగురు సీబీఐ అధికారులను బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కొత్తగా నియమితులైన తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు రద్దుచేశారు. ఆ ఏడుగురు అధికారులు తిరిగి తమ తమ స్థానాల్లో కొనసాగాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాలను పరిశీలించిన ఆలోక్ తనపట్ల కేంద్రం అవమానకరంగా వ్యవహరించిందని పేర్కొంటూ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.