Breaking News

పెత్తనం అవసరం లేదు.. అభివృద్ధే అవసరం..!

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజాకూటమిని గెలిపిస్తేనే సాధ్యమన్న చంద్రబాబు

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి, మేనకోడలు నందమూరి సుహాసినికి మద్దతుగా చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజాకూటమిని గెలిపిస్తేనే సాధ్యమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీపైనా తనపైనా విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు.

తెలుగుదేశం పార్టీకి ఇక్కడ పనేంటని టీఆర్ఎస్ ప్రశ్నిస్తుందని ఈ సభ చూస్తే తాను ఎందుకు వచ్చానో ఏం పనుందో తెలుస్తుందని, ఎన్టీఆర్ పార్టీ పెట్టింది తెలంగాణలోనేనని గుర్తు చేశారు. తెలంగాణలో టీడీపీ ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.

తెలంగాణలో తనకు పెత్తనం చెయ్యాల్సిన అవసరం లేదని, తాను దూరదృష్టితో ఆలోచించి తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో తనకున్న స్థానాన్ని చెరపలేరని చంద్రబాబు అన్నారు.

సైబరాబాద్ నిర్మించింది తానేని, హైటెక్ సిటీని నిర్మించి హైదరాబాద్‌కు ప్రపంచ పటంలో గుర్తింపు తీసుకువచ్చింది కూడా తానేనని, తెలుగుదేశం పార్టీకి కంచుకోట కూకట్ పల్లి నియోజకవర్గమని చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు మున్సిపాలిటీ నీళ్లు కూడా వచ్చేవి కావని, అలాంటి కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని ఎంతో కష్టపడి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పక్కనే హైటెక్ సిటీని నిర్మించానని అటువైపు మలేషియన్ టౌన్ షిప్ ఇక తాగేందుకు కృష్ణా నీళ్లు తీసుకువచ్చానని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.

leave a reply