గులాబీ పార్టీలో అంతర్గతంగా ప్రశ్చన్న యుద్దం నడుస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వ్యవహారశైలిపై హరీష్రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. క్రమేపీ హరీష్కు ప్రాధాన్యత తగ్గిస్తున్నారని విస్తృత చర్చ నడుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఉన్నట్టుండి కేటీఆర్కు అప్పగించడం, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తూ హరీష్ రావు ప్రస్థావన తేవకపోడంతో ఆయన తీవ్ర ఆవేదన, అసంతృప్తికి గురయ్యారన్న ప్రచారం జరుగుతోంది.
ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన కేసీఆర్ సూపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా కారు స్పీడు అందుకోలేకపోయాయి. 119 స్థానాలకుగానూ ఏకంగా 88 చోట్ల గులాబీ పార్టీ విజయం సాధించింది. ఈ క్రెడిట్ పూర్తిగా కేసీఆర్ ఖాతాలోకే వెళ్లిపోయింది. నిజానికి కేసీఆర్తోపాటు ఆయన తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్రావు ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. గులాబీ పార్టీ ఎక్కడెక్కడ బలహీనంగా ఉందో గుర్తించి ఆ నియోజకవర్గాల బాధ్యతను కేసీఆర్ ప్రత్యేకంగా హరీష్కు అప్పగించారు. కాళేశ్వరంతో ముదిరిన వివాదం..! కావాలనే పక్కకు పెట్టారంటున్న హరీష్ అనుచరులు..! ముఖ్యంగా కొడంగల్, గజ్వేల్ పోల్ మేనేజ్ మెంట్ బాధ్యతలను హరీష్ సమర్ధవంతగా నిర్వహించారు కాబట్టే ఆయా నియోజక వర్గాల్లో అనుకున్న ఫలితాలు వచ్చాయనే చర్చ జరుగుతోంది.
పార్టీ గెలుపుకోసం ఇంత శ్రమించినప్పటికి తగిన గుర్తింపు రావడం లేదని హరీష్ వర్గంలో ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వర ప్రాజెక్టు పనులు వేగంగా జరగడానికి అహర్నిశలు శ్రమించారు. నాలుగైదు రోజులపాటు ప్రాజెక్టు బాట పట్టి పనులు పరుగులు పెట్టించారు. మిషన్ కాకతీయ పేరిట చెరువుల పునరుద్దరణలో హరీష్రావు కీలకపాత్ర పోషించారు.
ముఖ్యంగా కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీ పనులు చివరి దశకు వచ్చాయంటే హరీష్ చేసిన కృషి ఫలితమే. కానీ ఆ క్రెడిట్ ఇప్పుడు తన ఖాతాలో పడేలా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్షించారు. దీనికి సంబంధం లేని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్, ఎంపీ వినోద్ను సమావేశంలో కూర్చోపెట్టారు. అలాగే ఈ నెల 1, 2 తేదీల్లో ప్రాజెక్టులను స్వయంగా కేసీఆర్ వెళ్లి పరిశీలించివచ్చారు. ఈ రెండు సందర్భాల్లోనూ సాగునీటి శాఖను పర్యవేక్షించి ఆయా ప్రాజెక్టులపై ఎంతో అవగాహన ఉన్న హరీష్రావును పిలవలేదని తెలుస్తోంది.
సమీక్ష సమావేశంతోపాటు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినప్పుడు కూడా హరీష్రావును కేసీఆర్ దూరంగా పెట్టారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం, టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తే.. చివరికి సముచిత స్థానం ఇవ్వకుండా తనను మామ పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అసంతృప్తి హరీష్రావులో వ్యక్తమవుతోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ విషయంలో ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోతున్నప్పటికీ, చంద్రశేఖర్ రావు వైఖరిలో వచ్చిన మార్పుతో హరీష్రావు ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది.