నిద్ర లేచింది మొదలు తిరిగి పడుకునే వరకు తీరికలేకుండా పరుగులు పెడుతుంటాం. ఆఫీసుకి వెళ్లేవరకూ వంట, భర్త, పిల్లల అవసరాలు తీర్చడానికే సమయం సరిగా సరిపోదు. ఇక అల్పాహారం తీసుకునే తీరిక ఎక్కడిది? ఇంక ఏదో తిన్నాం అంటే తిన్నాం అన్నట్లు హడావుడిగా తినడం, లేదా బాక్సులో సర్దుకుని ఏ బస్సులోనో తినేయడం చేస్తుంటాం. ఇలా తినడం వల్ల శరీరానికి పోషకాలు సరిగా అందకపోవచ్చు. శరీర జీవక్రియలు సక్రమంగా సాగాలంటే కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అంటే పాలు, గుడ్లు, చేపలు, ఆకుకూరలు, కాయగూరలు వంటివి మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
ఒక్కోసారి పనిఒత్తిడిలో సరిగా పట్టించుకోకుండా ఆకలితో సంబంధం లేకుండా ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో తెలియకుండా తింటుంటాం. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే ముందు మీ రోజువారీగా తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. తినడానికి సమయం కేటాయించుకోవాలి. ఏం తిన్నా కూడా పూర్తిగా నమిలి తింటే అది సులువుగా జీర్ణమవుతుంది.
కొన్నిసార్లు సమయం లేదంటూ ఉదయాన్నే చేసిన ఆహారాన్ని మళ్ళి వేడిచేసి తింటుంటారు. ఒకసారి చేసిన పదార్థాలు తాజాగా, వేడిగా ఉన్నప్పుడు మాత్రమే తినడం మంచిది. లేదంటే జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి.