రహస్యమంతా.. బెడ్‌రూమ్‌లోనే ఉంది

రఫెల్ యుద్ధ విమానాలపై పార్లమెంటులో పెద్ద దుమారమే చెలరేగింది. పార్లమెంటులో చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీఫ్ సింగ్ సూర్జేవాలా సంచలన ఆరోపణలు చేశారు. రఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించిన వివరాలన్నీ రక్షణ శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బెడ్ రూమ్‌లోనే ఉన్నాయని, ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మరియు గోవా మంత్రి విశ్వజిత్ రాణే మధ్య జరిగినదిగా చెబుతున్న సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ ను మీడియాకు విడుదల చేసి కాక రేపారు.

రాఫెల్ ఒప్పందానికి సంబంధించిన సమాచారం మొత్తం తన బెడ్ రూములోనే ఉందని, ఆ డాక్యుమెంట్లన్నీ తన ఫ్లాట్‌లో భద్రంగా ఉన్నాయని పారికర్ అందులో పేర్కొన్నారని ఆయన ఆరోపించారు. కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేసేందుకే ఆయన వాటిని తన వద్ద దాచుకున్నారని సూర్జేవాలా ఆరోపించారు.  రాఫెల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలన్న తమ డిమాండ్‌కు కేంద్రం అంగీకరించకపోవడం వెనక ఉన్న కారణాల్లో ఇది కూడా ఒకటన్నారు. దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

మరోవైపు పారికర్‌కు, తనకు మధ్య జరిగిన సంభాషణగా చెబుతున్న ఆడియో టేప్ నకిలీదని గోవా మంత్రి రాణే పేర్కొన్నారు. తనపై వస్తున్న ఆరోపణలను రాణే ఖండించారు. గత వారం గోవా కేబినెట్ సమావేశంలో పారికర్ మాట్లాడుతూ రాఫెల్ డీల్‌కు చెందిన మొత్తం డాక్యుమెంట్లు, ఫైలు తన బెడ్రూంలో ఉన్నట్టు కాంగ్రెస్ విడుదల చేసిన ఆడియో టేపులో స్పష్టంగా వినిపిస్తోంది. రాఫెల్ పై పార్లమెంటులో జరిగిన చర్చ కాంగ్రెస్ బిజెపి నేతల మధ్య  మాటల యుద్దంలా సాగింది.

leave a reply