ఆంధ్రప్రదేశ్తో పాటు… ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్, కేరళ, తమిళనాడు సహా దేశంలోని ప్రధాన రాష్ట్రాలన్నీ గో బ్యాక్ మోడీ అని నినాదాలిస్తోంది. ఢిల్లీకి పోయి మళ్లీ ప్రధాని కుర్చీలో కూర్చోమని కాదని, గుజరాత్కు పొమ్మని చెబుతున్నాని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోడీకి కౌంటర్ ఇచ్చారు. గుంటూరు సభలో తన పర్యటనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను ఆయన టీడీపీ మళ్లీ తనను ఢిల్లీకి పొమ్మంటోందని అంటే ఢిల్లీలో అధికారం చేపట్టమని చెబుతోందని అర్థం చెప్పుకుని సంతోషపడ్డారు. దీనికి చంద్రబాబు గంట వ్యవధిలోనే కౌంటర్ ఇచ్చారు. గుంటూరులో నలభై వేల మందికి ఇళ్ల స్థలాలిచ్చే కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు గుంటూరు సభలో మోడీ చేసిన ప్రతి విమర్శకు కౌంటర్ టు కౌంటర్ సమాధానం ఇచ్చారు.
గురువుకు పంగనామాలు పెట్టిన వ్యక్తి మోడీ అని మండిపడుతూ అద్వానీ విషయంలో మోడీ వ్యవహరించిన తీరు దేశం మొత్తం చూసిందన్నారు. అప్పట్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బకొట్టిందని ఇప్పుడు ఆ పని బీజేపీ చేస్తోందన్నారు. ఆత్మగౌరవం కాపాడుకోవడం పుట్టిన పార్టీ కాబట్టి… బీజేపీపై పోరాటం చేస్తున్నామన్నారు. మహాకూటమి ఏదో మోడీని తిట్టడానికి ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారని… దేశం కోసమే అందర్నీ ఏకతాటిపైకి తెస్తున్నానని ప్రకటించారు.
టీడీపీ ఏ పని చేసిన రాష్ట్రం, దేశం కోసమే చేస్తుందన్నారు. మోడీ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడటానికే కూటమి కట్టామన్నారు. మోడీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని రాఫెల్ డీల్ సహా అనేక అంశాలను చెప్పి ఈ అక్రమాలను అరికట్టడానికే కూటమి కడుతున్నామని స్పష్టం చేశారు. తనను తాను చౌకీదార్గా చెప్పుకున్న మోడీ వేల కోట్లు ఎగవేసి… అక్రమార్కులు దేశం విడిచి వెళ్లిపోతుంటే ఎందుకు పట్టంచుకోలేదని మండి పడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే అన్ని పార్టీలను కలిపేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. అన్ని పార్టీలు కలిస్తే మీరు ఇంటికి వెళ్తారని జోస్యం చెప్పారు.
ఏపీ విషయంలో మోడీ ఏమీ చెప్పకుండా వెళ్లడాన్ని ప్రశ్నించారు. గన్నవరం నుంచి హెలికాఫ్టర్ లో వెళ్లేటప్పుడు అమరావతిని చూసి అబ్బురపడి ఉంటారనన్నారు. తాను సహకరించకపోయినా అద్భుతంగా నిర్మాణం జరుగుతోందని బాధపడి ఉంటారన్నారు. ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి తనను తిట్టడానికే మోడీ వచ్చారని మండిపడ్డారు. సోమవారం ఢిల్లీకి వచ్చి ఏపీ విషయంలో మోడీ తీరును దేశవ్యాప్తంగా చెబుతానన్నారు. చంద్రబాబు మోడీ మాటలకు తగ్గట్లుగానే పూర్తిగా కౌంటర్ ఇచ్చారు.