సుప్రీం తీర్పు: ఎవరి వాదనలు వారివే..!

పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న పరిణామాలపై సుప్రీం కోర్టు నేడు తన తీర్పును వెలువరించింది. బెంగాల్ పోలీస్ కమిషనర్‌ రాజీవ్ కుమార్.. సీబీఐ ఎదుట హాజరు కావాల్సిందేనని.. సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రెండు రోజుల క్రితం రాజీవ్‌కుమార్ ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు వెళ్లడంతో.. కోల్‌కతా పోలీసులు అడ్డుకున్నారు. సీబీఐ అధికారుల్నే అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కోర్టు ధిక్కరణ అంటూ.. సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌పై.. అటు బెంగాల్ ప్రభుత్వం.. ఇటు సీబీఐ తమ వాదనలు వినిపించాయి. వాదన తర్వాత కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను.. సీబీఐ ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ.. రాజీవ్‌కుమార్‌ను అరెస్ట్ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోల్‌కతాకు పోలీస్ కమిషనర్‌గా రాజీవ్‌కుమార్ ఉన్నందున.. అక్కడ పోలీసు వ్యవస్థ మొత్తం ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి.. విచారణ ..మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఉంటుంది.

అయితే, సుప్రీంకోర్టు తీర్పు తమకు అంటే.. తమకు అనుకూలం అని కేంద్రం, మమతా బెనర్జీ.. ఎవరికి వారు ప్రకటించుకుంటున్నారు. సీబీఐ అధికారులు రాజీవ్‌కుమార్‌ను అరెస్ట్ చేయడానికే వచ్చారని.. లేకపోతే.. ఆదివారం రోజు… యాభై మంది ఒకే సారి ఆయన ఇంటిని చుట్టుముట్టడం ఏమిటని.. బెంగాల్ ప్రభుత్వం వాదించగా.. అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది కాబట్టి.. తమ నైతిక విజయం అని మమతా బెనర్జీ ప్రకటించారు.

మరో వైపు.. విచారణకు హాజరు కావాలని, కోల్‌కతా పోలీస్ కమిషనర్ని సుప్రీం ఆదేశించింది కాబట్టి… సీబీఐ విచారణను.. బెంగాల్ ప్రభుత్వం అడ్డుకున్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయమని కేంద్ర ప్రభుత్వం తమకు తాముగా ప్రకటించుకుంది. ఇలా రెండు వర్గాలు ఎవరికి వారు సుప్రీంకోర్టు తీర్పు తమ నైతిక విజయం అని చెప్పుకుంటున్నాయి. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇది.. సీబీఐకి వచ్చిన విజయంగా తెలిపారు.

ఇదిలా ఉంటే మరోవైపు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా సీబీఐ వ్యవహారంపై పార్లమెంట్ దద్దరిల్లిపోతోంది. పార్లమెంటు సమావేశాలలో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. విపక్షాలన్నీ.. బెంగాల్ వ్యవహారంపై ఆందోళన చేయడంతో.. చర్చలేమి జరగకుండా సోమవారం వాయిదా పడ్డాయి. కాగా ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. సీబీఐ వ్యవహారంతో… విపక్ష పార్టీలకు… కేంద్రంపై పోరాడటానికి మరో చురుకైన అస్త్రం లభించడంతో.. తమకు మంచి అవకాశంగా భావిస్తున్న విపక్షాలు మమతా బెనర్జీక పెద్ద ఎత్తున మద్దతు ప్రకటిస్తున్నాయి.

leave a reply