ఇప్పుడంటే కార్లు లేదా టూ వీలర్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ప్రతీ ఒక్కరి ఇళ్లల్లోనూ టూ వీలర్లు ఉండటం కామన్. చిన్న పనికైనా.. చిన్న దూరానికైనా టూ వీలర్స్ ఉపయోగించడం కామన్ అయిపోయింది. టూ వీలర్స్ వల్ల పనులు త్వరగా పూర్తయిపోతాయని.. ఆఫీస్లకు త్వరగా వెళ్లొచ్చు అని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఒప్పుడు ఎక్కువగా సైకిళ్లనే వాడేవారు. ఇప్పుడున్న కాలంలో సైకిల్ తొక్కేవారే చాలా తక్కువగా కనిపిస్తారు. అది కూడా ఏ స్కూల్కో లేదా ఇంట్లో చిన్న పిల్లలు ఆటలకో ఉపయోగించడం. కానీ మీకు తెలుసా..! సైకిల్తో కనీసం 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే చాలు. దాంతో అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో మీకుతెలుసా..?
సైకిల్ తొక్కడం వల్ల శరీరం మొత్తానికి వ్యాయామం అవుతుంది. దీంతో దాదాపుగా అన్ని భాగాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. డయాబెటిస్ ఉన్నవారు సైక్లింగ్ చేస్తే ఎంతో మంచిది. షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. నిత్యం 30 నిమిషాల పాటు సైకిల్ తొక్కితే 60 శాతం వరకు మధుమేహం తగ్గే అవకాశాలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే హైబీపీ ఉన్న వారు సైక్లింగ్ చేస్తే బీపీ తగ్గుతుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
సైకిల్ తొక్కుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోడం, వదలడం వేగంగా చేస్తారు కనుక శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారు సైక్లింగ్ అలవాటు చేసుకుంటే ఆ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆరంభంలో కొంత కష్టంగా ఉన్నప్పటికీ నెమ్మదిగా ప్రయత్నిస్తే కీళ్ల నొప్పుల సమస్య నుంచి శాశ్వతంగా పరిష్కారం పొందవచ్చు. పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో నిత్యం సైక్లింగ్ చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. డిప్రెషన్, ఒత్తిడి తగ్గుతాయని సైకియాట్రిస్టులు చెబుతున్నారు. అలాగే మెదడు పనితీరు మెరుగు పడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మతి మరుపు తగ్గుతుందని వారు అంటున్నారు.