గప్టిల్‌ సెంచరీ… సిరీస్ కైవసం!

న్యూజిలాండ్-బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో కివీస్ వరుసగా రెండో వన్డే విజయంతో సిరీస్ కైవసం చేసుకుంది. ఓపెనర్ మార్టిన్‌ గప్టిల్‌ (88 బంతుల్లో 118; 14 ఫోర్లు, 4 సిక్సర్లు)తో విజృంభించడంతో బంగ్లాదేశ్‌ ఓటమి పాలైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచిన కివీస్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోగా… ముందుగా బంగ్లాదేశ్‌ 49.4 ఓవర్లలో 226 పరుగుల వద్ద ఆలౌటైంది. మిడిలార్డర్‌లో మిథున్‌, షబ్బీర్‌ రహ్మాన్‌ రాణించడంతో ఈ మాత్రం స్కోరును చేయగలిగారు.

కివీస్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌ 3, ఆస్టల్, నీషమ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్‌ కేవలం 36.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి  229 పరుగులు చేసి గెలిచింది. తొలి వన్డేలో అజేయ సెంచరీ సాధించిన గప్టిల్‌ ఈ మ్యాచ్‌లోనూ సెంచరీ తో చెలరేగిపోయాడు. 76 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీని పూర్తిచేసుకున్నాడు. రెండో వికెట్‌కు కెప్టెన్‌ విలియమ్సన్‌ (65 నాటౌట్‌; 3 ఫోర్లు)తో కలిసి 143 పరుగులు జోడించాడు. అనంతరం టేలర్‌ (21 నాటౌట్, 3 ఫోర్లు)తో కలిసి విలియమ్సన్‌ మిగతా లాంఛనాన్ని పూర్తిచేశాడు. దీంతో రెండో వన్డేలో న్యూజిలాండ్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

leave a reply