జమ్మూకాశ్మీర్లోని పూల్వామా ఉగ్రదాడిలో అమరులైన ఓ జవాను కుటుంబానికి భూమి ఇస్తానని ప్రముఖ సినీ నటి సుమలత అన్నారు. ‘గురు అంత్యక్రియలు నిర్వహించడానికి స్థలం కేటాయింపులో ఏవో ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలిసింది. జవానుగా అతని త్యాగానికి గొప్పగా వీడ్కోలు చెప్పడమే మనం ఇచ్చే గౌరవం. అందుకే జవాను కుటుంబానికి అర ఎకరం భూమి ఇవ్వాలని నేను, అభిషేక్ నిర్ణయించుకున్నామని తెలిపారు. జమ్మూకాశ్మీర్లోని పూల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. అదిల్ అహ్మద్ దర్ అనే ఉగ్రవాది సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులంతా ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ ట్వీట్లు చేశారు. అమితాబచ్చన్, విజయ్ దేవరకొండ తదితరులు ఆర్థికసాయం ప్రకటించారు.