అక్రమాలతో గెలిచారు.. కోర్టులో కేసు..!

ఎన్నికల తర్వాత అజ్ఙాతంలోకి వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై పోటీ చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి, అక్రమాలతో గెలిచాడని అతడిని అనర్హుడిగా ప్రకటించాలని రేవంత్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. రేవంత్ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించి విచారించనుంది. ఎన్నికల్లో మద్యం, నగదు పంచారని, ఈవిఎంల పై కూడా అనుమానాలు ఉన్నాయని రేవంత్ పిటిషన్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయాన అందరి చూపు కొడంగల్ పైనే ఉంది. కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా టిఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు. అయితే పట్నం నరేందర్ రెడ్డి కోట్ల రూపాయలు పంచారని, విచ్చల విడిగా మందు పంచారని రేవంత్ గతంలో ఆరోపించారు. ఎన్నికల సమయాన కొడంగల్ లో టఫ్ పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డిని పలు కారణాలతో అరెస్టు చేయడంతో కొడంగల్ లో హైటెన్షన్ వాతావరణం నడిచింది.

హరీష్ రావు, కేటిఆర్, సీఎం కేసీఆర్ కొడంగల్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ముందుగా పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ లో పోటి చేయడానికి ఇష్టం చూపలేదు. కేటిఆర్ పట్టుబట్టి నరేందర్ రెడ్డిని బరిలో నిలిపాడు. అంతే కాదు చాలెంజ్ గా తీసుకొని గెలిపించుకున్నాడు. రేవంత్ రెడ్డి తను  గెలుస్తానన్న ధీమాతో ఇతర నియోజకవర్గాలలో కూడా ప్రచారం చేశాడు.  కానీ చివరికి అనూహ్యంగా రేవంత్ ఓటమి పాలయ్యారు. రేవంత్ రెడ్డి గెలుస్తాడని అంతా భావించారు. కానీ చివరి క్షణాన బలపడ్డ పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించాడు. 

టిఆర్ఎస్ పార్టీ అక్రమాలు చేసి గెలిచిందని కాంగ్రెస్ నేతలు గతంలోనే ఆరోపించారు. ఈవీఎంలలో కూడా అక్రమాలు చేశారని, అధికార యంత్రాగాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్నారన్నారు. ఎన్నికల అధికారులు టిఆర్ఎస్ ఏజంట్లలా పని చేశారని, అందుకే టిఆర్ఎస్ విజయం సాధించిందని వారు బహిరంగ విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత రేవంత్ రెడ్డి కాస్త రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి మరో రెండేళ్ల వరకు మీడియాతో మాట్లాడడని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత అవి నిజం కాదని రేవంత్ అనుచరులు తెలిపారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల హడావుడిలో రేవంత్ ఉన్నారు.

leave a reply