అగ్రవర్ణ పేదల కోసం రాజ్యాంగ సవరణ

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిన కేంద్రం ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది.  దానికి సంబంధించి లోక్‌సభలో 124వ రాజ్యంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి థావర్‌ చంద్‌ గహ్లోత్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.

జనరల్‌ విభాగంలో ఆర్థికంగా వెనకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాలని సోమవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. విద్య, ఉద్యోగ రంగాల్లో దీనిని వర్తింపజేస్తారు.

కాగా, 10 శాతం కోటా వల్ల బ్రాహ్మణులు, రాజ్‌పుట్‌లు, జాట్లు, మరాఠాలు, భూమిహార్‌లు, వైశ్య, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ వంటి పలు సామాజిక వర్గాలు లబ్ధి పొందనున్నాయి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకున్న 49.5% రిజర్వేషన్లకు ఇది అదనం. అంటే రిజర్వేషన్లు 59.5% అవుతాయి.

కాగా, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయసభల్లో 2/3 వంతు మెజారిటీ అవసరం. రిజర్వేషన్లకు పేదరికరం ఒక అర్హత కాదు. సామాజిక వెనకబాటు తనమే ప్రాతిపదిక కావాలి. ఈ రెండు కారణాలు చేత 10 శాతం కోటా చట్టం న్యాయస్థానాలలో నిలవదని వారి కొందరి వాదన.

50 శాతం రిజ్వర్వేషన్ల సీలింగ్ ఎవరు  నిర్ణయించారు, ఎపుడు నిర్ణయించారు?  ఈ సీలింగ్ 1992లో సుప్రీంకోర్టే నిర్ణయించింది. అపుడు బాగా సంచలనం సృష్టించిన  ఇంద్రా సాహ్ని కేసులో  ఒబిసిలకు 27శాతం రిజర్వేషన్లు ఉండాలనే దాని మీద తీర్పు ఇస్తూ సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50శాతం మించరాదని పరిమితి విధించింది.

 ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలుచేసేందుకు, 50 శాతం సీలింగ్ ను అధిగమించేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్ డి ఎ ప్రభుత్వం ఇపుడు ప్రయత్నిస్తున్నది. ఎలాగంటే… సామాజిక, విద్య వెనకబాటు తనాలకే రిజర్వేషన్లు ఉండాలని రాజ్యాంగంలోని అర్టికల్ 16(4) చెబుతూ ఉంది.  ఈ అడ్డంకిని అధిగమించేందుకు రాజ్యాంగ సవరణ చేసి ‘ఆర్థిక వెనకబాటు తనం’ అనే ప్రాతిపదికను కూడా చేరుస్తున్నారు.

 అదే విధంగా 50 శాతం సీలింగ్   మాటేమిటి అనే ప్రశ్న వస్తుంది. దీనికి కేంద్రం వద్ద ఉన్న సమాధానం- 50 శాతం సీలింగ్ ఎస్సి, ఎస్టి, బిసిల రిజర్వేషన్ల కు సంబంధించింది. కొత్త 10 శాతం కోటా కు వీటికి సంబంధం లేదు. వాటికి నష్టం లేకుండా జనరల్ సీట్లలో 10 శాతం కేటాయిస్తారు.

అంటే ఈ10 శాతం రిజర్వేషన్లలోకి అగ్రవర్ణాలోని ధనికులు రారు. వాళ్లకి ఈ సీట్లు వర్తించవు.  వారు  10 శాతం సీట్లు లేదా ఉద్యోగాలు కోల్పోతారు. అపుడు వారు మౌనంగా ఉంటూ దీనికి అంగీ కరిస్తారా? 10 శాతం  కోటాను వదలుకుంటారా?

 నిజానికి అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం ఇది మొదటి సారి కాదు. 1991 సెప్టెంబర్ 25న అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వంమొదటి సారి ప్రకటించింది. అపుడు మండల్ కమిషన్ రికమెండేషన్ అంటే ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేశారు. అపుడే అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కేటాయించారు.

అయితే ఆర్థిక ప్రాతిపదిక అనేది రాజ్యాంగంలో లేదు కాబట్టి ఈ 10 శాతం రిజర్వేషన్లు చెల్లవని సుప్రీం కోర్టు పివి నరసింహారావు  ప్రభుత్వ ఉత్వర్వులను కొట్టి వేసింది. దీనిని అధిగమించేందుకే ఇపుడు ఎన్‌డిఏ ప్రభుత్వం రాజ్యాంగ సవరణకు పూనుకుంటున్నది.

ఇపుడున్న రిజర్వేషన్ కోటా ఇది ఎస్ సి15  శాతం, ఎస్టి 7.5  శాతం, ఒబిసి 27 శాతం. మొత్తం 49.5 శాతం అవుతుంది.

ఇపుడు 10 శాతం పెంచితే దీనికి తోడవుతుందా లేక అది జనరల్ సీట్ల నుంచి వస్తుందా, అసలు రాజ్యాంగబద్ధమా అనేది తేలాలి.

రిజర్వేషన్లకు ఆర్థిక వెనకబాటు తనం కూాడా ప్రాతిపదిక అవుతుందా అనేది సుప్రీం కోర్టు ఇపుడు పరిశీలించాలి.  ఈ 10 శాతం కోటా న్యాయ స్థానంలో నెగ్గితే, ఆంధ్రలో కాపులకు రిజర్వేషన్లు వచ్చినట్లే…అపుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ హామీ ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లకు కూడా ఈ వాదన వర్తించాలిగా.

leave a reply