తిరుపతిలో ప్రకటించిన సర్వేపై తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అదంతా అబద్ధమంటూ ట్వీట్ చేసిన స్ర్కీన్ షాట్ పోస్టు చేయడంపై ఒకప్పటి కాంగ్రెస్ నేత లడగపాటి రాజగోపాల్ మీడియా సమావేశం ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో లగడపాటి మాట్లాడుతూ ఎవరో వ్యక్తులు తనపై ఒత్తిడి చేస్తే సర్వేలు మార్చే వ్యక్తిని తాను కాదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు.
పదవుల కన్నా వ్యక్తిత్వం ముఖ్యమని, సర్వే పేరుతో తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించడంలేదని లగడపాటి అన్నారు. ఒత్తిడితో నా సర్వే మార్చానని కేటీఆర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఎవరో ఒత్తిడి చేస్తే సర్వేలు మార్చే వ్యక్తిని కాదు. నాకు పదవులు కన్నా వ్యక్తిత్వం ముఖ్యం. సెప్టెంబర్ 15 లేదా 16న కేటీఆర్ నా సమీప బంధువుల ఇంట్లో కలిశారు. అప్పట్లో ఎన్నికల విషయంలో నా సాయం కోరారు. దీంతో ఎమ్మెల్యేలను మార్చకపోతే ప్రమాదం ఉందని నాకున్న రాజకీయ అనుభవంతో వారిని మారిస్తే మంచిదని ఆయనకు సూచనలు చేశా. అరెస్టులు చేయించడం మంచిది కాదని కూడా సూచించా. చంద్రబాబును కలుపుకొని వెళితే మంచిదని చెప్పా. కాని ఒంటరిగానే వెళ్తామని బదులిచ్చారు. ఆ తర్వాత మంచి సలహాలు, సూచనలు చేశారని నాకు మెసేజ్ పెట్టారు.
నవంబర్ 11 తేదీ నాటికి కేటీఆర్ 37 మంది అభ్యర్థుల విషయంలో సర్వే చేయమని అడగగా.. కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉందని కేటీఆర్కు మెసేజ్ పెట్టా. పోటా పోటీగా ఉన్నప్పుడు అభ్యర్థులే ప్రధానం అవుతారని చెప్పా. మళ్లీ నవంబర్ 20న మరోసారి మెసేజ్ పెట్టా. అప్పటికీ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం చూసి టీఆర్ఎస్కు 65-70 వస్తాయని చెప్పా. ప్రజాకూటమికి 35 నుంచి 40 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేశా. దీనిపై కేటీఆర్ స్పందించి దానికంటే ఎక్కువే వస్తాయని నాకు బదులిచ్చారు. ఆ తర్వాత ప్రజల ఆలోచన విధానం వేగంగా మారింది. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి తదితర హామీల విషయంలో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. కూటమి కట్టకముందు టీడీపీకి ఉన్న 20 శాతం ఓట్లు టీఆర్ఎస్కు వెళ్లాయి. కూటమి ఏర్పాటు తర్వాత ఆ ఓట్లు తిరిగి ప్రజాకూటమికి మళ్లాయి. ఈ ఉదయం కూడా మళ్లీ సమాచారం వచ్చింది. వరంగల్ జిల్లాలోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందని లగడపాటి వివరించారు.