అసెంబ్లీకి ముందే.. రాజీనామాలు ఆమోదం

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా 2014లో ఎన్నిక అయిన చంద్రబాబు నాయుడి చివరి అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేస్తూ బుధవారం నుండి అసెంబ్లీ ఉంటుందని ప్రకటించిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీలో ఉండి రాజీనామా చేసిన ఇద్దరి ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కోడెల రాజీనామాలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

బీజేపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబు తమ పదవులకు స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చెయ్యడంతో స్పీకర్ వాటిని ఆమోదిస్తూ ఉత్తర్వులను విడుదల చేశారు. అమోదానకి ముందు ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, రావెల కిషోర్ లతో ఫోన్లో చర్చించిన స్పీకర్ రాజీనామాలు ఆమోదించాలని వారు కోరడంతో వెంటనే వాటిని ఆమోదించారు.

కాగా, రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు  ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలను పెండింగ్ లో పెట్టారు.  అందుకు కారణం కూడా లేకపోలేదు.

బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు, టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రాజీనామాలు ఇంకా స్పీకర్ కార్యాలయానికి చేరుకోలేదని సమాచారం. మేడా మల్లికార్జునరెడ్డి విప్ పదవికి సైతం రాజీనామా చేశారు.

ఇటీవలే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని కలిసిన మేడా మల్లికార్జునరెడ్డి ఈనెల 31న జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అటు మాణిక్యాలరావు పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధికి ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన 56 హామీలు అమలు చెయ్యాలని రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

leave a reply