నా తండ్రి విగ్రహానికి జగన్ పర్మిషన్ కావాలా..?

పార్టీని వీడిన అనంతరం వైసీపీ శ్రేణలు తనపై చేస్తున్న వ్యాఖ్యలపై వంగవీటి రంగ తనయడు వంగవీటి రాధా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత తండ్రి వంగవీటి రంగా విగ్రహావిష్కరణ చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు ఆంక్షలు పెట్టారని… ఆ పార్టీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ మండిపడ్డారు. నాలుగేళ్ల పాటు వైఎస్‌ జగన్ తో వ్యవహరించిన విధానంతోనే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీడ్కోలు చెప్పానన్నారు.

తన తండ్రి విగ్రహావిష్కరణకు జగన్ పర్మిషన్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఆంక్షలు లేని.. ప్రజాజీవితాన్ని కొనసాగిస్తానని, వైసీపీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని, వంగవీటి రాధాకృష్ణ.. ఒక్కొక్కటి చెప్పుకొచ్చారు. పార్టీలో చేరినప్పుడు.. సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుంటానని చెప్పారని.. కానీ, సొంత తమ్ముడినే ఘోరంగా మోసం చేశారని… మండి పడ్డారు. తమ్ముడినే ఇలా మోసం చేస్తే రేపు సామాన్య ప్రజలను ఇంకెంతగా మోసం చేస్తారోనన్నారు.

తనకు జరిగిన అవమానాలు ఇంకెవరికీ జరగకూడదని, పార్టీలో తనకు ఎదురువుతున్న అవమానాలను జగన్ దృష్టికి తీసుకెళ్లినప్పుడల్లా… ” నీ తండ్రి మీద గౌరవంతో పార్టీలో ఉండనిచ్చా.. ” అని పదే పదే అవమానించేవారన్నారు. “తాను వదిలిస్తే.. గాలికి వెళ్లిపోతాడని…” తన ముందే అనే వారని వంగవీటి రాధాకృష్ణ గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.

పేదల కోసం నా తండ్రి పోరాటం చేశారు.. నా తండ్రి ఆశయ సాధనే లక్ష్యమని, ఇప్పటికైనా జగన్ పద్దతి మార్చుకుని రంగా అభిమానులను గౌరవించాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తో కలిసి పని చేయాలని ఉన్నా.. జగన్ మాత్రం.. సర్వం నేనే.. నా కిందే అందరూ పని చేయాలనుకున్నట్లుగా ఉంటారన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని.. ఎవరి బెదిరింపులకు భయపడే ప్రశ్నే లేదన్నారు. తనపై ఎవరూ జాలి చూపించాల్సిన అవసరం లేదన్నారు వంగవీటి రాధా.

వైసీపీకి రాజీనామా చేశానని.. టీడీపీలోకి రావాలని ఆహ్వానించారని చెప్పారు. టీడీపీలో చేరికపై ఆయన నేరుగా ప్రకటించలేదు కానీ.. టీడీపీ విషయంలో సాఫ్ట్ గా స్పందించారు. టీడీపీపై ఇంత కాలం పోరాటం చేసి ఆ పార్టీలో ఎలా చేరుతారన్న ప్రశ్నకు దీటుగానే సమాధానం ఇచ్చారు.

గతంలో వంగవీటి రాధా కులాలపై పోరాడలేదని కమ్యూనిస్టులతో పోరాడారని ఆ తర్వాత కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశామని గుర్తు చేశారు. వ్యక్తులు చేసిన విషయాలను పార్టీకి అంట గట్టడం సరి కాదన్నారు. వంగవీటి రంగా .. హత్యకు గురైనప్పుడు టీడీపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీపై ఇప్పటికీ కొంత మంది ఆరోపణలు చేస్తూంటారు. అయితే.. గతంలో రాధా తల్లి వంగవీటి రత్నకుమారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ ఎమ్మెల్యే అయ్యారు అని వంగవీటి రాధా గుర్తుచేశారు.

leave a reply