సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లాలోని సతీశ్ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి గురువారం అర్ధరాత్రి నింగిలోకి పంపిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ44 విజయవంతంగా ప్రయోగించబడింది. 2019 లో తొలి ప్రయోగాన్ని విజయవంతంగా ప్రారంభించామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. బుధవారం రాత్రి 7.37 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా 28 గంటలపాటు కొనసాగింది. ఈ ప్రయోగం ద్వారా తమిళనాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన 1.2 కిలోల బరువున్న కలాంశాట్తోపాటు 740 కిలోల మైక్రో శాట్-ఆర్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. కలాంశాట్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. మైక్రోశాట్-ఆర్ దేశ రక్షణ రంగ అవసరాల కోసం(డీఆర్డీవో) పంపారు. దీనికి డీఆర్డీఏ వారు పెలోడ్లను సమకూర్చారు. ఈ ప్రయోగంతో భారత్ తొలిసారిగా రోదసిలో ఒక తాత్కాలిక వేదికను ఏర్పాటు చేసింది
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సిరీస్లో దీనిని పీఎస్ఎల్వీ-డీఎల్గా పిలుస్తున్నారు. ప్రయోగం విజయవంతమైన అనంతరం ఇస్రో ఛైర్మన్ డాక్టర్ శివన్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగంలో తమిళనాడు విద్యార్థులు తయారు చేసిన “కలామ్ శాట్ ” భాగమవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సైన్స్ ప్రయోగాలపై యువత దృష్టి పెట్టి విజ్ఞాన భారతంగా మార్చాలని ఆయన పేర్కొన్నారు. అటు విజయంతో అంతరిక్షంలోకి చేరిన పీఎస్ఎల్వీ-సీ 44 ప్రయోగాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. అనుకున్న సమయానికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి చేయడంఫై అయన హర్షం వ్యక్తం చేసారు.