టైటిల్ దిశగా…సింధు,సైనా!

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు కొత్త సీజన్‌ను విజయంతో ప్రారంభించాలని… అదే దిశగా పయనిస్తోంది. ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో సింధు క్వార్టర్స్‌కు చేరుకుంది. లీ జురుయ్‌తో జరిగిన తొలి రౌండ్‌   ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో సులువుగా గెలుపొందింది. సింధుతో పాటు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌ కూడా  క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో రెండోసీడ్‌ సింధు 23–21, 21–7తో గ్రెగోరియా మరిస్కా టుంజుంగ్‌ (ఇండోనేసియా)పై శ్రమించి తక్కువ సమయంలోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలి గేమ్‌లో సింధుకి గట్టి పోటీ ఎదురైనా, తరువాతి రెండో గేమ్‌లో గ్రెగోరియా సింధు ధాటికి చేతులెతేసింది. దీనితో సింధు మంచి విజయాన్ని అందుకుంది.

అటు లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతకం సాధించిన సైనా నెహ్వాల్‌ 21–17, 21–15తో  ఫిత్రియాని పై చక్కని విజయాన్ని అందుకుంది. ముఖాముఖీ రికార్డులో సైనా 5–0తో ఆధిక్యంలో నిలిచింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ శ్రీకాంత్‌ 21–14, 21–9తో ఆసియా క్రీడల కాంస్య పతక విజేత కెంటా నిషిమోటో (జపాన్‌)ను ఓడించడంతో విజయం సాధించాడు. అయితే పురుషుల  డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మను అత్రి–సుమీత్‌ రెడ్డి (భారత్‌) ద్వయం 14–21, 21–17, 10–21తో ఐదో సీడ్‌ కిమ్‌ ఆస్ట్రుప్‌–ఆండర్స్‌ స్కారుప్‌ రస్‌మసెన్‌ (డెన్మార్క్‌) జోడీ చేతిలో ఓటమిని చవిచూసింది.  

leave a reply