కర్ణాటకలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లా కార్వార సమీపంలోని కాళీ నదిలో సంభవించిన పడవ ప్రమాదంలో 16 మంది జల సమాధి అయ్యారు. మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న వెంటనే నౌకాదళ అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలను చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం 26 మందితో వెళ్తున్న పడవ కాళీ నదిలో బోల్తా కొట్టింది.
కాళీ నదిలో మధ్యలో ఉన్న ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. పడవ బోల్తా కొట్టిన వెంటనే ఒడ్డున ఉన్న మత్స్యకారులు శరవేగంగా స్పందించారు. తమ పడవలతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇద్దర్ని రక్షించారు.
మృతులను జయశ్రీ కొఠారకర్, గణపతి కొఠారకర్, నీలేష్ పెడ్నేకర్, అమోల్ బెళగావి, దర్శన్ కార్వార, సురేష్ చండియా, ఆదర్శ్ మాజాళి, శ్రీనివాస అరగా, చేతన్ కుమార్ అరగాగా గుర్తించారు. మరో ఎనిమిది గల్లంతు కావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే నౌకాదళ అధికారులు, తీర ప్రాంత రక్షక సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలను చేపట్టారు.