దేశ వ్యాప్తంగా బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె కొనసాగుతుంది. విజయ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, దేనా బ్యాంక్లను విలీనం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దీనిని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుండటంతో బ్యాంకు సేవలు నిలిచిపోయాయి తెలుగురాష్ట్రాలలో కూడా బ్యాంకు ఉద్యోగులు విధులకు దూరమయ్యారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకు సమ్మె విరమించేది లేదని ఉద్యోగులు తేల్చి చెప్పారు .
అయితే ప్రైవేట్ రంగ బ్యాంకులు యథావిథిగా కొనసాగుతున్నాయి. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), ఎన్సీబీఈ, ఎన్ఓబీడబ్ల్యూ సహా తొమ్మిది యూనియన్ల సంయుక్త సంఘమైన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకులు బోసిపోవడంతో పాటు ఆర్థిక లావాదేవీలు స్తంభించిపోయాయి. సమ్మె ఫలితంగా బ్యాంక్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు సమాచారం .