ప్రకృతి వ్యవసాయ సదస్సులో శనివారం సీఎం చంద్రబాబు పాల్గొని వ్యవసాయ ప్రాముఖ్యతను గురించి వివరించారు. వ్యవసాయంలో ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా నాగార్జున వర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ప్రాంగణంలో ప్రకృతి వ్యవసాయ సదస్సును చంద్రబాబు శనివారం ఉదయం ప్రారంభించి, ప్రకృతి వ్యవసాయం ఎంతో శ్రద్ధతో, పటిష్టంగా అమలు చేయలని అన్నారు. దాదాపు ప్రస్తుతం ఏపీలో 5.8లక్షల మంది ప్రకృతి సేద్యం చేస్తున్నారన్నారని, 2024లోపు ఆ సంఖ్య 60లక్షల వరకూ చేరుకోవాలని కోరుకుంటున్నా అని వాఖ్యానించారు. కత్తెర పురుగు ఉద్ధృతిని ప్రకృతి సేద్యం ద్వారా నివారించామని, ఈ సేద్యంలో పరిశోధనలు, మార్కెటింగ్ కోసం పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థ ఐటీసీ సైతం ముందుకొచ్చిందని సీఎం తెలిపారు. ప్రకృతి సేద్యంపై మరిన్ని పరిశోధనలు జరగాలన్నారు. అరకు కాఫీ తోటలను సహజ సేద్యం ద్వారా పండిస్తున్నామని సీఎం వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్తో పాటు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబు తదితరులు పాల్గొన్నారు. శనివారం నుంచి 10 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. సుమారు 2వేల మంది మహిళా రైతులు పాల్గొన్నారు.