సోమవారం వైసీపీ నేత బాలశారి మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్, జయలలితల బయోపిక్లు తెరకెక్కుతున్నాయని, ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కూడా బయోపిక్ కూడా తీస్తే ‘మహానగరాల్లో మాయగాడు‘, ‘యూటర్న్ మోసగాడు’ అనే పేర్లు పెట్ట వచ్చని ఎద్దేవా చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆమన ధీమా వ్యక్తం చేశారు.
ముందు ముసిముసి నవ్వులు నవ్విన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు కేంద్రంపై ఎందుకు మండిపడుతున్నారని అన్నారు. 9 శ్వేత పత్రాలు విడుదల చేసిన చంద్రబాబు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లతో కొనుగోలు చేశారో చెప్పాలన్నారు. మ్యానిఫెస్టో అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్ట్ కట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని, హైకోర్టు కట్టలేక సాకులు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సోనియాను దెయ్యమన్న చంద్రబాబుకు ఇప్పుడు ఆమె అలా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుందని, ఒంటరిగా పోటీ చేసే సత్తా తమ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు.