ఐసీసీ 2019 ప్రపంచకప్లో టీమిండియా తన సూచనలు పాటించాలని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ తెలియచేసాడు. ఈ సారి కోహ్లి సేన ఈ మెగా టోర్నీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్న్ తెలిపాడు. అయితే జట్టులో మార్పులు చేస్తే సరిపోతుందని తెలిపాడు. ప్రపంచకప్లో ప్రత్యర్థి జట్టును అయోమయానికి గురిచేసేందుకు టీమిండియా ఓపెనర్లుగా రోహిత్ శర్మ, రిషబ్ పంత్లు వస్తే బాగుంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. అయితే ఇప్పుడున్న ఓపెనర్ల జోడి రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లు అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ప్రపంచకప్ గెలవాలంటే జట్టులో కొన్నిమార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు.
అయితే తన నిర్ణయాన్ని వివరిస్తూ… ప్రపంచకప్ 1992లో భాగంగా న్యూజిలాండ్ కూడా ఓపెనర్లను మార్చి, అలాగే మొదటి ఓవర్ను స్పిన్నర్తో ప్రారంభించి విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేశాడు. ఇటువంటి మార్పులు చేస్తే ప్రత్యర్థి జట్టు తికమకపడుతుందన్నాడు. టీమిండియా కూడా ఇలాంటి విభిన్న ఆలోచనలు చేస్తే గెలుపు ఖాయమని పేర్కొన్నాడు.
అటు టీమిండియా మాజి కెప్టెన్ ధోనిఫై తనకు నమ్మకం ఉందన్నాడు. యువ ఆటగాళ్లతో కూడిన కోహ్లి సేనకు ధోని అనుభవం కీలకంగా మారుతుందన్నాడు. అంతేకాకుండా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడం ధోని అదనపు బలమంటూ కితాబిచ్చాడు. అయితే ధోని కోసం టీమిండియా యువ బ్యాట్స్ మెన్ పంత్ను పక్కకు పెట్టాల్సిన అవసరం లేదని, పంత్ను వికెట్కీపర్గా కాకుండా బ్యాట్స్మన్గా పరిగణించి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఆస్ట్రేలియా సిరీస్లోనే పంత్ను ఓపెనర్గా పంపించి ప్రయోగం చేయాలన్నాడు. ఇక టీమిండియా బౌలింగ్ గురించి చెప్పనవసరం లేదన్నాడు.