‘పేట’ పేలిందా..!

రజనీకాంత్‌ అనగానే స్టైల్‌కు మరో పేరని చెప్పొచ్చు. ఆయన ప్రతీ సినిమాలో ఒక్కో స్టైల్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటారు. అలాగే మాస్‌ ఎలిమెంట్స్‌ కూడా కనిపిస్తాయి. రజనీ అనగానే స్టైల్‌ అండ్‌ మాస్‌గా అభిమానులు గుర్తిస్తారు. తమిళనాడులో అయితే తలైవా సినిమా విడుదల అంటే ఒక పెద్ద పండగ వాతావరణమే అనొచ్చు. రజనీకి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అభిమానం ఆయన సొంతం. ఆయన సినిమాలన్నీ అమెరికాలో కూడా రిలీజ్‌ అవుతాయి. అలాగే తెలుగులో కూడా తలైవా అభిమానులకు కొదవేం లేదు. తెలుగులో కూడా ఆయన ప్రతీ సినిమా రిలీజ్‌ అవుతుంది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన `పేట­’ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్‌తో సినిమా దూసుకెళ్తుందని చెప్పవచ్చు. అయితే ముందే రిలీజైన ‘ఎన్టీఆర్‌ – కథానాయకుడి’ సినిమా ప్రభావం `పేట’ సినిమాపై కొంత పడిందని చెప్పవచ్చు. `పిజ్జా’ మూవీ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు డైరెక్షన్‌ ‘పేట’ మూవీ వచ్చింది. మాస్‌, రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘పేట’ మూవీ ఉందని అంటున్నారు. అయితే.. ఈ మూవీ అలనాటి అందాల తార సిమ్రాన్‌, బ్యూటీ త్రిషా నటించారు. ఈ చిత్రం ద్వారా రజనీ అభిమానులను మెప్పించారా..? లేదా అని తెలుసుకోవాలంటే.. కథ ఏంటో చూడాల్సిందే.

కథ..

అసలు కథేంటంటే.. కులాంతర వివాహాల గురించి, ప్రేమించుకున్న వారు ఏ కులమైనా, మతమైనా వారిని ఒకటి చేయాలనే కోణంలో కథ సాగుతుంది. ఓ హాస్టల్‌ వార్డెన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఓ కాలేజీలో హాస్టల్‌ వార్డెన్‌గా కాళి(రజనీకాంత్‌) చేరతాడు. అయితే.. అక్కడ చోటుచేసుకున్న అనేక సమస్యలను తనదైన స్టైల్లో పరిష్కరిస్తాడు రజనీ. ఆ కాలేజీలో జరిగే ర్యాగింగ్‌, గొడవలకు పులిస్టాప్‌ పెట్టి, స్టూడెంట్స్‌కి మంచి విలువలు, విషయాలు నేర్పిస్తాడు. అయితే.. అక్కడే ఓ ప్రేమజంటను కలుపుతాడు రజనీ. ఆ గొడవల్లో రజనీ అసలు గతం బయట పడుతుంది. అతను కాళీకాదు పేట వీర అని, ఉత్తరప్రదేశ్‌కి చెందిన వ్యక్తి అని, అక్కడ చోటుచేసుకున్న గొడవలు బయటకు వస్తాయి. ఇదీ ఇంటర్‌ వెల్‌ సీన్‌.

సెకండాఫ్‌లో ప్రారంభమయ్యే ఫ్లాష్‌బ్యాక్‌లో కులాంతర వివాహం అనే వివాదం సినిమాకు కేంద్రబిందువుగా మారుతుంది. ఓ ముస్లిం యువకుడికి, నవాజుద్దీన్ సిద్ధిఖీ అనే వ్యక్తి చెల్లెలి మధ్య ఉండే ప్రేమ వ్యవహారం పేటతో వైరానికి కారణమవుతుంది. తన ఇష్టానికి వ్యతిరేకంగా తన చెల్లెలి పెళ్లిని జరిపించడంతో ప్రతీకారం పెంచుకొని నవాజుద్దీన్ చేసిన దాడిలో పేట తన భార్య, కుమారుడిని కోల్పోతాడు. ఆ సమయంలో ఓ కారణంతో పారిపోయి ఓ ఊరికి దూరమవుతాడు. చివర్లో ఓ ఇంట్రెస్టింగ్ ముగింపుతో సినిమా ముగుస్తుంది. సెకండాఫ్ మొత్తం రజనీకాంత్ స్టయిల్‌పైనే దృష్టిపెట్టినట్టు కనిపిస్తుంది. సెంటిమెంట్ సీన్లలో భావోద్వేగం లేకపోవడం సినిమాకు ప్రతికూలత అనిచెప్పవచ్చు.

ఎవరెలా చేశారంటే..

రజనీ తన న్యూ స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. తన నటనతో అభిమానులను మెప్పించారు. రజనీలో ఉండే మాస్‌ ఎలిమెంట్స్‌ మిస్‌ అయిన ప్రేక్షకులకు ఈ సినిమాలో అన్నీ దొరుకుతాయని చెప్పొచ్చు. రజనీ తరహా డైలాగులు, నడక, హావభావాలు, యాక్షన్, రొమాంటిక్ సీన్లు ఫ్యాన్స్‌కి పండుగ వాతావరణం తెచ్చిపెట్టేలా ఉంటాయి.

ఇక అలనాటి తార సిమ్రాన్‌ కూడా కథకు తగ్గట్టుగా పాత్రలో అందంగా కనిపించారు. ఇక బ్యూటీ త్రిష తన పాత్రలో ఒదిగిపోయారనే చెప్పాలి. ఇక మేఘా ఆకాశ్ కూడా బాగా నటించారు. ఇక బాబీ సింహా పాత్ర పరవాలేదనిపిస్తుంది. మిగతా నటీనటులు అంతగా గుర్తిండిపోయే విధంగా లేరు.

పేట సినిమాలో ఇద్దరు విలన్స్‌. అందులో ఒకరు విజయ్‌ సేతుపతి. భజ్‌రంగ్‌ దళ్‌ సంస్థకు నేతగా కనిపించి అలరించాడు సేతుపతి. లవర్స్‌ డే రోజు ప్రేమికులకు పెళ్లిళ్లు చేయడం లాంటి సీన్స్‌లో విజయ్‌ బాగా చేశాడనే అనాలి. రజనీతో కొన్ని సీన్లలో నువ్వా-నేనా అనే విధంగా నటించి చూపించాడు.

డైరెక్షన్‌..

కాకపోతే.. డైరెక్షన్‌ మాత్రం ట్రైలర్‌లో చూసినంత ఎగ్జైటింగ్‌గా ఉండదు. పాత స్టోరీనే అయినా.. కొత్త ఎలిమెంట్స్‌ యాడ్‌ చేసి చూపించినట్టు ఉంటుంది. కానీ.. ప్రేక్షకులకు నచ్చే విధంగా రజనీ స్టైల్‌ను, మేనరిజమ్‌ను కల్పిపించి తీసాడు డైరెక్టర్‌ కార్తీక్‌. ఇక హీరోయిన్ల పాత్రలు నామమాత్రంగానే ఉంటాయి. కథలో అనేక లోపాలు, నేరేషన్‌లో క్లారిటీ మిస్సాయ్యాడు. పాత్రల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటం కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి లోపాల మధ్య క్లైమాక్స్‌లో వాలి, సుగ్రీవుల కథను చెప్పి ప్రేక్షకుడిని కన్విన్స్ చేయడంలో డైరెక్టర్‌ కార్తీక్‌ సఫలమయ్యాడనే చెప్పవచ్చు.

చివరగా.. రజనీకాంత్‌ అభిమానులకు కావాల్సినవన్నీ ఈ సినిమాలో దొరుకుతాయనే చెప్పొచ్చు.

leave a reply