సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. ప్రముఖ నేతలందరూ సీట్ల కోసం తగిన ప్రాధాన్యత కోసం పార్టీలు మారుతున్నారు. ఈ ప్రక్రియలోనే మంత్రి సోమిరెడ్డికి వలసల షాక్ తగిలింది.
1999లో చివరిసారిగా ఎన్నిలకల్లో నెగ్గిన ఆయన అనంతరంల మూడు దఫాలుగా టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ.. చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడిగా ఉండటం, ప్రతిపక్షం నేత జగన్పై క్రమం తప్పకుండా విమర్శలు చేయడంలో ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మరి మంత్రిపదవి ఇచ్చారని నెల్లూరు జిల్లాలో ఎవర్ని అడిగినా చెబుతారు.
అలాంటి, సోమిరెడ్డి తన కుటుంబంలోని ఓ వ్యక్తి వైఎస్ఆర్ సీపీలో చేరుతుంటే అడ్డుకోలేకపోయారు. ఆయన బావ రామకోట సుబ్బారెడ్డి. సోమిరెడ్డి చెల్లెలి భర్త. తన ఇద్దరు కుమారులు శశిధర్రెడ్డి, కళాధర్రెడ్డిలతో కలిసి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బుధవారం హైదరాబాద్లో వైఎస్ జగన్ను కలవగా, జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన చేరిక వెనుక వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చక్రం తిప్పినట్టు చెబుతున్నారు. సంక్రాంతి పండుగనాడు వేమిరెడ్డి రామకోట ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అప్పుడే రామకోట సుబ్బారెడ్డి చేరిక ఖాయం అనే వార్తలు వెలువడ్డాయి.
సోమిరెడ్డి కుటుంబ సభ్యులు, జిల్లా టీడీపీ నాయకులు ఆ వార్తలను తోసిపుచ్చినా, ఆయన ఏ పార్టీలో చేరరని, తమతోనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. సరిగ్గా 10 రోజులు తిరిగే సరికి రామకోట వైఎస్ఆర్ సీపీలో చేరడం నెల్లూరు జిల్లా టిడిపికి షాక్ కొట్టినట్టయింది. నెల్లూరు జిల్లాలో ప్రతిపక్ష పార్టీ గ్రామీణ స్థాయిలో పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో వరుసగా మూడు ఎన్నికల్లోనూ ఓడిపోవడానికి కారణం అదే.