మెడ పట్టుకుని తోసేద్దాం.. అనుకుంటున్నారా..?

కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో రాజంపేట రచ్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ తరపున కడప జిల్లా నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి. నాలుగేళ్ల పాటు ఆయన టీడీపీలో.. సౌకర్యంగానే ఉన్నప్పటికీ.. ఇటీవలి కాలంలో.. ఆయన వైసీపీలో చేరుతారన్న చర్చ ఊపందుకుంది. ఆయన సోదరులు.. వైసీపీ ముఖ్యనేతలతో వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. పోటీ చేసింది మేడా అయినప్పటికీ.. ఆయన సోదరులే రాజకీయ వ్యవహారాలు చక్క బెడుతూంటారు. ఈ క్రమంలో.. ఒకటి, రెండు సార్లు చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. కానీ ఇటీవలి కాలంలో ఆయన చంద్రబాబు పిలిచినా సమావేశానికి వెళ్లడం లేదు. దాంతో ఆయన పార్టీ మారడం ఖాయమని టీడీపీ వర్గాలు డిసైడయ్యాయి.

ప్రస్తుతం కడప జిల్లా టీడీపీ రాజకీయాలను చక్క బెడుతున్న మంత్రి ఆదినారాయణరెడ్డి.. రాజంపేటలో.. కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మేడాతో పాటు.. .ఆయన వర్గీయులు ఎవర్నీ ఆహ్వానించలేదు. ఈ సమావేశంలో మేడా మల్లిఖార్జునరెడ్డిపై… ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. పార్టీ నుంచి పోవాలనుకుంటే పోవచ్చని.. పార్టీలోనే ఉండి నష్టం చేయడం మంచిది కాదని.. ఎవరు పార్టీ నుంచి వెళ్లిపోయిన ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు. మేడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని… 17వ తేదీన ముఖ్యమంత్రితో సమావేశం ఉందని పిలిచినా రాలేదని… అన్నారు. అయితే.. రాజంపేటలో ఆదినారాయణరెడ్డి టీడీపీ కార్యకర్తల భేటీ పెట్టడంతో.. పోటీకి మేడా మల్లిఖార్జున రెడ్డి కూడా.. అనుచరులతోసమావేశమయ్యారు. తాను పార్టీ మారడం లేదని ప్రకటించారు.

తనను పార్టీ నుంచి బయటకు పంపేందుకు మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రయత్నిస్తున్నారని మేడా ఆరోపించారు. దొడ్డి దారిన మంత్రి అయి పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22వ తేదీన ముఖ్యమంత్రితో సమావేశమై అన్ని వివరాలు చెబుతానని ప్రకటించారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. మొత్తానికి మేడా మల్లిఖార్జున రెడ్డి వ్యవహారం కడప టీడీపీలో కలకలం రేపుతోంది. ఆయన పార్టీ మారడం ఖాయమని.. ఇప్పటికే… టీడీపీ హైకమాండ్‌కు క్లారిటీ ఉండటంతో.. కొత్త నాయకత్వాన్ని ప్రొత్సహిస్తోంది. ఆ బాధ్యతను… ఆదినారాయణరెడ్డి తీసుకున్నారు.

leave a reply