ఫ్లెక్సీ, లేఖపై ఎన్ఐఏ ఆరా..!

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును పరుగులుపెట్టిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఘటనకు సంబంధించి ప్రతీ అంశంపైనా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కేసు విచారణను వేగవంతం చేసిన ఎన్ఐఏ అధికారులు నిందితుడు శ్రీనివాసరావు స్వగ్రామం అయిన ముమ్మిడివరం మండలం ఠాణేలంకలోని పెదపేట గ్రామంలో విచారణ చేపట్టారు.

హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిర ఎన్‌ఐఏ సీఐ మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో మరో ముగ్గురు బృందం పెదపేటలో విచారణ చేపట్టింది. రెండు రోజులపాటు పెదపేటలో విస్తృతంగా విచారణ చేపట్టింది. శ్రీనివాసరావుకు ఉత్తరం రాసిచ్చిన జనిపెల్ల విజయదుర్గను ఆ గ్రామ వీఆర్వో భాస్కరరావు సమక్షంలో పలుమార్లు విచారించారు. అలాగే నిందితుడు శ్రీనివాసరావు చెప్పినట్లు లేఖ ఆమె రాసిందా అని తెలుసుకునేందుకు ఆమె చేతి రాతను పరీక్షించారు. విజయదుర్గ చేత పలుమార్లు లేఖలు రాయించారు.

అలాగే జగన్‌ కు శుభాకాంక్షలు చెప్తూ శ్రీనివాసరావు  వేయించిన ఫ్లెక్సీ, ఉత్తరం జిరాక్స్‌ కాపీ తీయించిన వ్యక్తులను విచారించారు. గ్రామస్థులను కూడా విచారించారు. ఉత్తరం జిరాక్స్‌ తీయించిన జనిపెల్ల శివసుబ్రహ్మణ్యంను విచారించి అతని దగ్గర నుంచి వివరాలు రాబట్టారు. నిందితుడు శ్రీనివాసరావు ప్రవర్తనపై అతని తల్లిదండ్రులు తాతారావు, సావిత్రి, సోదరుడు సుబ్బరాజులను అడిగి తెలుసుకున్నారు.

కుటుంబ ఆస్తి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు, ఇంటి నిర్మాణం, బ్యాంకులో తీసుకున్న రుణాలపై ఆరా తీశారు. బ్యాంకు పుస్తకాలను కూడా పరిశీలించారు. దీంతో పాటు ముమ్మిడివరం పోలీస్‌స్టేషన్‌లో శ్రీనివాసరావుపై గతంలో నమోదైన కేసు వివరాలు, విశాఖ ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌లో కుక్‌గా చేరిన సమయంలో ఎన్‌వోసీ కోసం ఏమైనా దరఖాస్తు చేసుకున్నాడా అన్న అంశాలపై ఆరా తీశారు.

ఈ బృందమే కాకుండా ఎన్‌ఐఏకు చెందిన ఇద్దరు అధికారులు గత ఐదురోజులుగా శ్రీనివాసరావుకు సంబంధించిన విషయాలపై నిశితమైన దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు సమాచారం. శ్రీనివాసరావుపై మరలా ఎన్‌ఐఏ అధికారులు విచారణ చేపట్టడంతో గ్రామంలో భయాందోళనలు చోటుచేసుకున్నాయి.

భయంతో ప్రజలు నోరు విప్పడం లేదు. ఇకపోతే రాష్ట్ర హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ నిందితుడు శ్రీనివాసరావును వారం రోజులపాటు కస్టడీ తీసుకుని విచారించింది. అలాగే 10 మంది వైసీపీ నేతలను సైతం విచారించింది. కాగా, విశాఖపట్నంలో ప్యూజన్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నజనిపెల్ల శ్రీనివాసరావు గత ఏడాది అక్టోబరు 25న విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై కోడి కత్తితో దాడిచేశాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

leave a reply