పేటకు యూ/ఏ ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘పేట’. సన్పిక్చర్స్ భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. రజనీకాంత్ సరసన తొలిసారిగా సిమ్రాన్, త్రిష హీరోయిన్లుగా నటించారు. విజయ్సేతుపతి, మేఘ ఆకాశ్, బాబిసింహా, శశికుమార్లు ఇలా ఇతర నటీనటులు కూడా ఈ సినిమాలో ఉన్నారు. సినిమా చిత్రీకరణ, నిర్మాణానంతర పనులు కూడా పూర్తయ్యాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘మాస్…’ పాట అభిమానులను అమితంగా ఆకర్షిస్తోంది.
కాగా.. ఈ సినిమాను సెన్సార్ ప్రదర్శనకు పంపించగా.. చిత్రాన్ని చూసిన అధికారులు ‘యూ/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో క్లైమాక్స్లో భారీ పోరాట సన్నివేశం ఉందని, అందుకే ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కొన్ని పోరాట సన్నివేశాలను మార్చితే ‘యూ’ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ అధికారులు చెప్పినట్లు కూడా సమాచారం. అయితే.. సినిమాలో ఎలాంటి సన్నివేశాలను మార్చకుండా ‘యు/ఏ’ ధ్రువపత్రం పొందినట్లు తెలుస్తోంది.