టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో వివాదాస్పద సంఘటన చోటుచేసుకుంది. భారత బౌలర్ కృనాల్ పాండ్యా వేసిన ఆరో ఓవర్ ఆఖరి బంతికి న్యూజిలాండ్ ఆటగాడు డార్లీ మిచెల్ వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. మిచెల్ ఎల్బీగా వెనుదిరగడం కాస్త కివీస్లో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా దానికి ఫీల్డ్ అంపైర్ సానుకూలంగా స్పందించి ఔట్గా ప్రకటించాడు. దీన్ని సవాల్ చేశాడు డార్లీ మిచెల్ డీఆర్ఎస్ అడగగా, అవతలివైపు క్రీజ్లో ఉన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా మిచెల్కు మద్దతుగా నిలిచాడు.
థర్డ్ అంపైర్ అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత ఔట్గా ప్రకటించారు. దాంతో మిచెల్తో పాటు విలియమ్సన్లు అది ఔట్ ఎలా ఇస్తారు అంటూ ఫీల్డ్ అంపైర్ను ప్రశ్నించడంతో కాసేపు అక్కడ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అది కచ్చితంగా ఇన్సైడ్ ఎడ్జ్ అయ్యిందంటూ వాదించిన మిచెల్ క్రీజ్ను వీడేందుకు ఇష్టపడలేదు. దాంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ను మరొకసారి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్పై స్పష్టత కోరారు. కాగా, థర్డ్ అంపైర్ మాత్రం తొలుత తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎటువంటి ఇన్సైడ్ ఎడ్జ్ కాలేదంటూ వివరణ ఇచ్చాడు. అయితే హాట్స్పాట్లో మాత్రం బంతి ఇన్సైడ్ ఎడ్జ్ అయినట్లు కనబడినప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించడంతో వివాదాస్పదమైంది. చివరకు నిరాశగా మిచెల్ పెవిలియన్ చేరాడు.