న్యూజిలాండ్,టీమిండియా మధ్య జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కృనాల్ పాండ్యాను అతని సోదరుడు హార్దిక్ పాండ్యా కొనియాడాడు. “నిన్ను చూస్తే గర్వంగా ఉంది బిగ్ బ్రో” అంటూ హార్దిక్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తెలిపాడు. వెల్లింగ్టన్లో జరిగిన తొలి టీ20లో హార్దిక్-కృనాల్లు ఇద్దరూ కలిసి మొదటి సారి జతగా భారత్ తరఫున ఆడారు. ఆ మ్యాచ్లో కృనాల్ ఒక వికెట్ను మాత్రమే సాధించినప్పటికీ అతనిపై సెలక్టర్లు మరొకసారి విశ్వాసం ఉంచారు. దాన్ని నిలబెట్టుకున్న కృనాల్..భారత విజయంలో తనదైన ముద్ర చూపించాడు.
న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ 20 మ్యాచ్లో మూడు కీలక వికెట్లు సాధించగా, ఈ మ్యాచ్ కు గాను కృనాల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. కృనాల్ వేసిన ఆరో ఓవర్లో రెండు వికెట్లు తీసి.. మరుసటి ఓవర్లో కేన్ విలియమ్సన్ను ఎల్బీగా పెవిలియన్ పంపాడు. దాంతో న్యూజిలాండ్ 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. ఈ దశలో గ్రాండ్హోమ్(50), రాస్ టేలర్(42)లు రాణించడంతో కివీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. టీమిండియా ఈ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి విజయం సాధించింది. దీంతో టీమిండియా సిరీస్ ను 1-1 తో సమం చేసింది.