రాఫెల్ డీల్పై క్రిమినల్ విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. సభలో భాగంగా రఫేల్ విషయంపై రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. పార్లమెంట్లో రాఫెల్పై ఇంత చర్చ నడుస్తుంటే.. ప్రధాని మోడీ గారు ఎటు పోయారని ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు చెప్పకుండా కేంద్రమంత్రి అరుణ్జైట్లీ తనపై విమర్శలు చేస్తున్నారని.. అలాగే కేంద్రమంత్రి నిర్మాలాసీతారామాన్ ఏం మాట్లాడారో కూడా అర్థంకాలేదన్నారు రాహుల్ గాంధీ.
‘రఫేల్ విమానాల ధర రహస్యంగా ఉంచే విషయమేమి కాదని మేడం చెప్పారు. మేడం సీతారామన్ జీ నేను మిమ్మల్ని లేదా పారికర్ను నిందితులుగా చూపించడం లేదు. ప్రధాని మోడీ ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి. నా ప్రశ్న ఒక్కటే. అనిల్ అంబానీకి ఈ కాంట్రాక్ట్ ఎలా వెళ్లింది. అంబానీకి కాంట్రాక్ట్ ఇవ్వాలని ఎవరు నిర్ణయించారు? రఫేల్ వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటి? భారత ప్రజల సొమ్ము వివరాలను వాళ్లకే తెలియడం లేదు. హెచ్ఏఎల్కు దక్కకుండా అనిల్ అంబానీ ఈ కాంట్రాక్ట్ను ఎలా పొందారు? అని రాహుల్ ప్రశ్నించారు.
అసలు.. రాఫెల్ డీల్ను ఎందుకు సీక్రెట్గా ఉంచారో చెప్పమని అడిగారు..? అలాగే ఆ డీల్ ప్రధాని మోడీ స్నేహితుడైన అనిల్ అంబానీకే కాంట్రాక్ట్ ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు?.. మాతో పాటు ప్రతిపక్షాలన్నీ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కోరుతున్నారని దయచేసి ప్రధాని మోడీ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని రాహుల్ స్పష్టం చేశారు.