రఫెల్ అంటే బోఫోర్స్ అనుకుంటున్నారా.. ఏమి..?

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై లోక్‌సభలో చర్చ చాలా ఉద్వేగపూరితంగా జరిగింది. చర్చ సందర్భంగా రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బురద జల్లుతున్నారని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. భారత్‌ కొనుగోలు చేసిన తొలి రఫేల్‌ యుద్ధ విమానం 2019 సెప్టెంబరు నెలలో దేశానికి వస్తుందని, మిగిలిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు 2022 నాటి కల్లా అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారం పూర్తవడానికి 14నెలల సమయం పట్టిందన్నారు. డిఫెన్స్‌ డీలింగ్స్‌కు.. డీలింగ్‌ ఇన్‌ డిఫెన్స్‌కు తేడా ఉందని తెలిపారు. తాము డిఫెన్స్‌ డీలింగ్స్‌ చేయమని అన్నారు.

దేశ భద్రతను, ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకునే ఒప్పందాలు చేసుకుంటామని అన్నారు. పొరుగుదేశాలైన చైనా, పాకిస్థాన్‌లు రక్షణ సంబంధ విషయాల్లో దూకుడుగా ఉంటే, అప్పట్లో యూపీఏ ప్రభుత్వం కేవలం 18 యుద్ధవిమానాలను మాత్రమే కొనుగోలు చేసి, భారత్‌ను ఎటూ కదల్లేని స్థితికి తెచ్చిందని ఆరోపించారు. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో తగిన సామగ్రిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే దీన్ని అత్యవసరంగా గుర్తించామని తెలిపారు.

చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో నిర్మలా సీతారామన్‌ వారికి గట్టిగానే చురకలంటించారు. తన సమాధానం వినేందుకు కూడా ప్రతిపక్ష సభ్యులు ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, యుద్ధ విమానాల కొనుగోలు దేశ భద్రతకు సంబంధించిన విషయమని అందరు గుర్తుంచుకోవాలన్నారు. ‘ఏ ఏ(అనిల్‌ అంబానీని ఉద్దేశిస్తూ)’ కోసమే యుద్ధ విమానాల కొనుగోలు చేశామని కాంగ్రెస్‌ భావిస్తే, ప్రతి ‘ఏఏ’ వెనుక ఒక ‘క్యూ(ఖత్రోకీని ఉద్దేశిస్తూ)’, ‘ఆర్‌వి(రాబర్ట్‌ వాద్రాను ఉద్దేశిస్తూ)’ ఉన్నారంటూ నిర్మలా సీతారామన్‌ విమర్శించారు.

‘రఫేల్‌ మీ హక్కు. దాన్ని మీరే తయారు చేయాలి’ అని బెంగళూరు హెచ్‌ఏఎల్‌ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. హెచ్‌ఏఎల్‌కు ఎందుకు ఇవ్వలేదో రాహుల్‌గాంధీ తెలుసుకోవాలని, హెచ్‌ఏఎల్‌ గొప్పలే కాదు, లోపాలనూ గుర్తించాలన్నారు. తేజస్‌ విషయంలో హెచ్‌ఏఎల్‌ వేగంగా పనిచేయలేదన్నారు. హెచ్‌ఏఎల్‌ విషయంలో కాంగ్రెస్‌ మొసలికన్నీరు కారుస్తోందని విమర్శించారు. తాము హెచ్‌ఏఎల్‌కు రూ.లక్ష కోట్ల ఒప్పందాలు అప్పగించామన్నారు.

‘‘రఫేల్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. ఈ వ్యవహారంపై ఆ పార్టీ చెప్పేవన్నీ అబద్ధాలే. జాతీయ భద్రతను కాంగ్రెస్‌ గాలికొదిలేసింది. ప్రధాని పట్ల అభ్యంతరకర పదజాలం వాడారు. వాయుసేన అధిపతిని సైతం అబద్దాలకోరుగా చిత్రీకరిస్తున్నారు. మెక్రాన్‌తో రాహుల్‌గాంధీ మాట్లాడలేదని కాంగ్రెస్‌ చెప్పింది. మా హయాంలో హాల్‌ సామర్థ్యాన్ని మెరుగుపరిచాం. చాపర్ల కొనుగోలు సమయంలో హెచ్‌ఏఎల్‌ను పక్కన పెట్టారు. డసో, హెచ్‌ఏఎల్‌ మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. హెచ్‌ఏఎల్‌ ఏడాదికి ఎనిమిది విమానాలకు మించి తయారు చేయలేదు. మీ హయాంలో హెచ్‌ఏఎల్‌ను పక్కన పెట్టి అగస్టాతో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు.’’ అని ప్రశ్నించారు.

leave a reply