పక్కా ప్రణాళికతోనే వైసీపీ అధినేత జగన్పై వైజాగ్ ఎయిర్పోర్టులో నిందితుడు శ్రీనివాస్ దాడి చేశాడని వైజాగ్ పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన సీపీ కేసుకు సంబంధించి పలు వివరాలను వెల్లడించారు. నిందితుడు శ్రీనివాస్ గతంలో వెల్డర్గా, కేక్ మాస్టర్గా, కుక్గా పలుచోట్ల పనిచేశాడని తెలిపారు. నిజానికి గతేడాది అక్టోబర్ 18నే శ్రీనివాస్ దాడి చేయాలని పథకం వేసినప్పటికీ అది సాధ్యం కాలేదని తెలిపారు.
దాడి జరిగిన రోజే కోడికత్తికి శ్రీనివాస్ సాన పట్టించాడని పేర్కొన్న సీపీ ఈ విషయం అతడి సహచరులకు కూడా తెలుసన్నారు. ఉదయం 4:55 గంటలకే ఇంటి నుంచి బయటకొచ్చిన శ్రీనివాస్ హేమలత, అమ్మాజీ అనే మహిళలకు ఫోన్ చేసి ఈ రోజు తాను టీవీలో కనిపిస్తానని చెప్పాడని వివరించారు. ‘ఈ రోజు ఓ సంచలనం చూస్తారు’ అని అమ్మాజీతో శ్రీనివాస్ పలుమార్లు చెప్పాడన్నారు. ఇకపై తన వద్దకు రావాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని వారికి చెప్పాడని సీపీ తెలిపారు.
కాగా.. ఉదయం రెస్టారెంట్లో మరోసారి కోడికత్తికి సాన పెట్టిన అనంతరం దానిని వేడి నీటిలో స్టెరిలైజ్ చేసినట్టు తెలిపారు. అనంతరం జగన్ విమానాశ్రయంలోకి రాగానే దానితో దాడి చేశాడని లడ్డా వివరించారు. జగన్తో తానున్న ఫ్లెక్సీని గతేడాది జనవరిలోనే శ్రీనివాస్ తయారు చేసి పెట్టుకున్నాడని తెలిపారు. జగన్పై విష ప్రయోగం చేయాలనే ఉద్దేశం శ్రీనివాసరావుకు లేదని సీపీ పేర్కొన్నారు.
అయితే.. తనపై దాడి ఘటనపై వైసీపీ జగన్ ఇప్పటికీ ఎలాంటి కంప్లైట్ పోలీసులకు ఇవ్వలేదన్నారు. హైకోర్టు తాము చెప్పేదాకా ఛార్జిషీట్ దాఖలు చేయవద్దని చెప్పిందని ఈ సందర్భంగా సీపీ మీడియాకు వివరించారు.