కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన పాండ్యా, కేఎల్ రాహుల్ వివాదంపై టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. “కాఫీ విత్ కరన్”షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న టీమిండియా ఆటగాళ్లు హార్దిక్,రాహుల్ వివాదంపై ఓవర్ రియాక్ట్ కావొద్దంటూ క్రికెట్ విమర్శకులకు రాహుల్ ద్రావిడ్ సూచించారు. మైదానంతోపాటు బయట ఉండే సవాళ్లపట్ల ఆటగాళ్లకు చక్కని అవగాహన కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. చాలా ఏళ్లుగా ఇండియా ఏ, అండర్ 19 క్రికెట్లో ఈ చర్యలు తీసుకుంటున్నామని అయన తెలిపారు. ఆటగాళ్ల ప్రవర్తనపై నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ట్రైనింగ్ ఉంటుందని అన్నారు. తీరికలేని షెడ్యూల్ వల్ల టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఈ కార్యక్రమానికి ఎక్కువగా హాజరుకాలేక పోతున్నారని చెప్పారు.
ఇంతకుమునుపెన్నడూ ఆటగాళ్లెవరూ ఇలాంటి పొరపాట్లు చేయలేదని కాదు. వర్క్షాప్లు నిర్వహించి అవగాహన కల్పించినంత మాత్రాన మళ్లీ అటువంటి ఘటనలు పునరావృతం కావని కాదు. కానీ, పాండ్యా, రాహుల్ వివాదం మాదిరిగా ఏవైనా జరిగినప్పుడు ఓవర్ రియాక్ట్ కావాల్సిన అవసరం . వివాదాస్పద వ్యాఖ్యలు మాట్లాడకుండా జాగ్రత్తపడాలి కానీ, ఘటన జరిగిన తర్వాత ఇష్టారీతిన కామెంట్లు చేయొద్దు అని ద్రవిడ్ సూచించాడు. గతంలో చోటుచేసుకున్న పొరపాట్ల గుర్తెరిగి ఆటగాళ్లు మసలుకోవాలి. భారత ఆటగాడిగా తమపై ఉన్న గురుతర బాధ్యతల్ని ప్రతి ఒక్క ఆటగాడు మరువకూడదు అని ద్రవిడ్ మీడియాతో పేర్కొన్నాడు.
జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లు భాద్యతగా మసులుకోవాలని క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ అన్నారు. కర్ణాటక సీనియర్ ఆటగాళ్లు, తల్లిదండ్రులు, పెద్దల నుంచి తాను చాలా విషయాలు నేర్చుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. చుట్టూ ఉన్నవారిని గమనించి మంచి విషయాలు అలవర్చుకున్నానని, తనకు మరెవరో వచ్చి పాఠాలు చెప్పేలా ఎప్పుడూ ప్రవర్తించనని వెల్లడించారు.