కార్పొరేట్ స్థాయిలో గాంధీ ఆస్పత్రిని తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. ఇకపై రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్ట్రెచర్లు, వీల్ చైర్లను ఏర్పాటు చేస్తున్నట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ శ్రావణ్ కుమార్ చెప్పారు. దీనిలో భాగంగా రూ.4లక్షల పైగా విలువ చేసే 80 వీల్చైర్లను రోగులకు అందుబాటులో ఉండేవిధంగా శనివారం ఏర్పాటు చేశామన్నారు.స్వచ్ఛందంగా అందజేసిన కొన్ని వీల్ చైర్లను అత్యవసర విభాగాలు, ఓపీ బ్లాకులు, ఇతర విభాగాల్లో సేవల కొరకు వినియోగించనున్నట్లు వెల్లడించారు.
కార్పొరేట్ స్థాయిలో గాంధీ ఆస్పత్రిలో వైద్యం అందరికి అందుబాటులోకి రావడంతో జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నట్లు సమాచారం. చాలామంది వీల్చైర్లు లేకపోవడం వల్ల సహాయకులే రోగుల్ని ఎత్తుకెళ్లి వార్డుల్లోకి తీసుకెళ్లడం స్వయంగా చూశానని, అందుకే వెంటనే నిర్ణయం తీసుకొని ఈ పద్ధతిలో ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులతో కలిసి వీల్చైర్లు సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ జయకృష్ణ, శేషాద్రి, డాక్టర్ అర్జున్ రాజ్లతో పాటు ఇతర ప్రొఫెసర్లు పాల్గొన్నారు. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, ఔట్సోర్స్ ఏజిల్ కాంట్రాక్టర్, జీపీ మెడికల్ షాపు, ఇతర సిబ్బంది కలిసి వారి సొంత డబ్బులతో ఆస్పత్రికి 80 వీల్ చైర్లను ఉచితంగా అందజేశారన్నారు.