ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన రెండో టెస్టులో శ్రీలంక బ్యాట్స్మన్ దిముత్ కరుణరత్నేకు బంతి బలంగా తగలడంతో గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న క్రమంలో ఆసీస్ బౌలర్ పాట్ కుమ్మిన్స్ వేసిన బంతిని ఆడే సమయంలో ఓపెనర్ కరుణరత్నే తీవ్రంగా గాయపడ్డాడు. ప్యాట్ కమిన్స్ వేసిన 31 ఓవర్లో నాల్గో బంతి వేగంగా కరుణరత్నేపైకి సుమారు 143 కి.మీ వేగంతో వచ్చింది. ఈ బంతిని తప్పించుకునేందుకు కరుణరత్నే ప్రయత్నించగా. అది కాస్తా నేరుగా వచ్చి మెడ వెనుక భాగాన బలంగా తగలడంతో కరుణరత్నే ఒక్కసారిగా గ్రౌండ్లోనే కుప్పకూలిపోయాడు.
అనంతరం గ్రౌండ్లోకి వచ్చిన మెడికల్ స్టాప్ హుటాహుటీనా కరుణరత్నేకు చికిత్స చేశారు. తరువాత అతన్ని స్ట్రెచర్పై బయటకు తీసుకువచ్చి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కాన్బెర్రా ఆస్పత్రిలో కరుణరత్నేకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీలంక జట్టు స్కోరు 82 పరుగుల వద్ద ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కరుణరత్నే 46 వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్ గా మైదానం వీడాడు. అంతకుముందు ఆస్ట్రేలియా 534-5 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.