మంధాన ధాటికి…కివీస్ విల విల!

న్యూజిలాండ్‌లో టీమిండియా పురుషుల జట్టుతో సమంగా మహిళల జట్టు హవా కొనసాగుతుంది. న్యూజిలాండ్ పర్యటనలో మహిళలతో జరిగిన తొలి వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్‌ 48.2 ఓవర్లకు 192 పరుగులు మాత్రమే చేయగలిగారు. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళలు 33.0 ఓవర్లలో కేవలం వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించారు. భారత ఓపెనర్లు స్మృతీ మంధాన( 105;104 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం సాధించగా, జమీమా రోడ్రిగ్స్‌(81 నాటౌట్‌; 94 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 190 పరుగులు జోడించి భారత్  విజయంలో కీలక పాత్రా పోషించారు. న్యూజిలాండ్‌ బౌలర్లను ఎక్కడ అవకాశం ఇవ్వకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే మంథాన సెంచరీతో మెరవగా, రోడ్రిగ్స్‌ అర్థ శతకం పూర్తి చేసింది. కాగా, భారత్‌ విజయానికి మూడు పరుగుల దూరంలో ఉండగా మంధాన భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరారు.

ముందుగా టాస్ గెలిచిన టీమిండియా కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీనితో బ్యాటింగ్‌ ఆరంభించిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు సుజీ బేట్స్‌, సోఫీ డివైన్‌లు శుభారంభాన్ని ఇచ్చారు. ఈ జోడి తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన తర్వాత సోఫీ డివైన్‌ పెవిలియన్‌ చేరారు. ఆపై బ్యాటింగ్ కి దిగిన వారందరు తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. అటు  సాటెర్‌వైట్‌(31), అమీలా కెర్‌(28)లు 49 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో కివీస్‌ కొంత ఫరవాలేదనిపించారు. వీరిద్దరూ 17 పరుగుల వ్యవధిలో ఔట్‌ కావడంతో న్యూజిలాండ్‌ 48.4 ఓవర్లలో 192 పరుగులకు ఆలౌటైంది.. ఏక్తాబిస్త్‌, పూనమ్‌ యాదవ్‌లు తలో మూడు వికెట్లు సాధించగా, దీప్తి శర్మ రెండు వికెట్లు, శిఖా పాండేకు వికెట్‌ దక్కింది.

leave a reply