పంచకప్లో ఏ మ్యాచ్ ఎలా ఉన్నా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే అందరిలో ఆసక్తి నెలకొంటుంది. దాయాధి దేశాలు తలపడుతున్నాయి అంటే ఆ మజానే వేరు. 2011 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఐసీసీ ఈవెంట్లోనూ గ్రూప్ దశలో ఈ చిరకాల ప్రత్యర్థులు పోటీపడుతూనే ఉన్నాయి. 2019 జరగనున్న వన్డే వరల్డ్ కప్లో కూడా జూన్ 16న ఇరు జట్లు తలపడనున్నాయి. కానీ వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్లో మాత్రం భారత్, పాకిస్థాన్ మధ్య గ్రూప్ దశలో మ్యాచ్ లేకపోవడం గమనార్హం. మంగళవారం 2020 టీ20 ప్రపంచకప్ షెడ్యూలును ఐసీసీ విడుదల చేసింది. ఈ రెండు జట్లు వేరు వేరు గ్రూపుల్లో ఉండటంతో ఒక్క మ్యాచ్ కూడా వీటి మధ్య జరగడం లేదు. కారణం ర్యాంకింగ్స్లో రెండు జట్లు తొలి రెండు స్థానాల్లో చేరడంతో, భారత్, పాకిస్థాన్ ను ఒకే గ్రూపులో ఆడించడం కుదరలేదు.
డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రెండు క్వాలిఫయింగ్ జట్లు గ్రూప్-Aలో, భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్, రెండు క్వాలిఫయింగ్ జట్లు గ్రూప్-Bలో చేరాయి. గ్రూప్-Bలో ఉన్న టీమిండియా తన తొలి మ్యాచ్ అక్టోబరు 24న దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానుంది. క్వాలిఫయింగ్ రౌండ్లు అక్టోబరు 18న ఆరంభమవుతాయి. టీ20 ర్యాంకింగ్స్లో టాప్-8
లో ఉన్న జట్లు నేరుగా ఈ టోర్నీకి అర్హత సాధించగా… ర్యాంకింగ్స్లో 9వ, 10వ స్థానాల్లో ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు మరో ఆరు జట్లతో కలిసి క్వాలిఫయింగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.