పంచాయతీ కార్యదర్శుల నియామకంపై స్టే..

తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ‘పంచాయతీరాజ్‌ శాఖ’కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు, కార్యదర్శుల నియామకాల విషయంలో సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జేపీఎస్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు నియామక ఉత్తర్వులు ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే భర్తీ ప్రక్రియను కొనసాగించవచ్చని తెలిపింది. ఈ పరిణామం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో 9,355 జేపీఎస్‌ పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేస్తున్నారని, తుది ‘కీ’ ప్రకటించకుండానే ఫలితాలను వెల్లడించారని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లికి చెందిన బి.హరీశ్‌కుమార్‌తోపాటు మరికొందరు హైకోర్టులో బుధవారం అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు.

దీంతో.. న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు విచారణ చేపట్టారు. ప్రాథమిక ‘కీ’పై 70 వేల మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారని పిటిషనర్ల న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎంపికైన జాబితాలో ఒకే హాల్‌టికెట్‌ నంబరు రెండు, మూడు సార్లు ఉందని తెలిపారు. జిల్లాకు ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఎన్ని మార్కులు వస్తే పోస్టుకు ఎంపిక అవుతారు? తదితర వివరాలేవీ అభ్యర్థులకు తెలియడం లేదని వివరించారు. రిజర్వేషన్లు 50% మించడానికి వీల్లేదని స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ జనరల్‌ అభ్యర్థులకు 45%,   రిజర్వుడు అభ్యర్థులకు 55శాతం రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు.

కాగా.. జేపీఎస్‌ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిందని, ఈ దశలో నియామకాలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వరాదని ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జె.రామచందర్‌రావు విజ్ఞప్తి చేశారు. స్పందించిన న్యాయమూర్తి.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయాలని స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నారు. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వరాదని తేల్చిచెప్పారు. ప్రతివాదులుగా ఉన్న పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శితోపాటు ఇతరులకు నోటీసులు జారీచేశారు.

leave a reply