కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’ సినిమా గురించి తెలియని వారుండరు. అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. అందులో కమల్హాసన్ నటన అద్భుతమనే చెప్పాలి. అటు తండ్రి పాత్రలో.. ఇటు కొడుకు పాత్రలో కమల్ ఒదిగిపోయారనే చెప్పొచ్చు. లంచగొండితనాన్ని ఎదుర్కొనే ఓ సామాన్యుడి జీవితం ఎలా ఉంటుందనేది సినిమాగా చూపించారు డైరెక్టర్ శంకర్. అయితే.. ఈ మధ్యనే ఈ సినిమాకు సీక్వెల్గా ‘భారతీయుడు 2’ సినిమాను తీస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ఈ సినిమా షూటింగ్ (శుక్రవారం) ప్రారంభమైంది.
అయితే.. ఈ సందర్భంలోనే ఓ విషయం బయటకు వచ్చింది. నిజంగా.. ఈ సినిమాలో సూపర్స్టార్ రజనీకాంత్ నటించాల్సి ఉందేదట. ఆయన కోసమే డైరెక్టర్ శంకర్ ‘పెరియా మనుషన్’ పేరుతో స్ర్కీప్ట్ కూడా రెడీ చేశారట. కాకపోతే.. అప్పుడు ఆయన బిజీగా ఉండటం వల్ల కమల్తో ఈ సినిమా తీయడం జరిగిందని ‘భారతీయుడు’ సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేసిన వసంత్ బాలన్ రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్లో తెలిపారు. అలాగే.. కమల్తో సినిమా ఒకే అయ్యాకనే ‘భారతీయుడు’ అనే టైటిల్ను మార్చారని పోస్ట్లో తెలియజేశారు.
అలాగే.. ‘భారతీయుడు’ సినిమాలో కుమారుడి పాత్రకు నాగార్జున లేదా వెంకటేశ్, తండ్రి పాత్రకు రాజశేఖర్ను తీసుకునేందుకు చర్చలు కూడా జరిగినట్లు ఆయన చెప్పారు. కాగా.. ‘భారతీయుడు 2’ షూటింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఈ చిత్రంలో కమల్కు జోడీగా కాజల్ నటించనుంది. ఇక మ్యూజిక్ అనిరుథ్ అందిస్తున్నారు.