టీమిండియా క్రికెటర్, స్టార్ ఆటగాడు అంబటి రాయుడికి ఐసీసీ నిషేధం విధించింది. రాయుడి బౌలింగ్ శైలిలో అనుమానం రావడంతో అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకుండా అతనిపై వేటు వేసింది. ఆసీస్ పర్యటనలో అతని బౌలింగ్ అనుమానాస్పదంగా ఉందని ఆరోపణలు వెల్లువెత్తడంతో బౌలింగ్ యాక్షన్కు సంబంధించిన పరీక్షకు హాజరుకావాల్సిందిగా ఐసీసీ ఆదేశించింది. అయితే అతను నిర్ణిత సమయంలో హాజరు కాకపోవడంతో ఐసీసీ చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్లో రాయుడు బౌలింగ్ చేయకూడదని, దేశవాళీ, బీసీసీఐ పరిధిలో జరిగే టోర్నీల్లో మాత్రం బౌలింగ్ చేసుకోవచ్చని తేల్చి చెప్పింది.
రాయుడు బౌలింగ్ శైలిని పరిశీలించి సక్రమంగానే బౌలింగ్ చేస్తున్నాడని పూర్తి నిర్ధారణకు వచ్చిన తరవాతే ఈ సస్పెన్షన్ తొలగిస్తామని ఐసీసీ తెలిపింది. న్యూజిలాండ్ పర్యటనతో బీజీగా ఉన్న రాయుడు పరీక్షకు రాలేకపోవడంతో, ఐసీసీ క్లాజ్ 4.2 నిబంధన ప్రకారం అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయకూడదని స్పష్టం చేసింది. సిడ్నీలో ఈ నెల 13న ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అంబటి రాయుడిఫై ఫిర్యాదు నమోదు చేయడం జరిగింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్తో పాటు దేశవాళీ వన్డేలు, టి20ల్లో అతను ఒక్కసారి కూడా బౌలింగ్ చేయకపోవడం విశేషం. సిడ్నీ మొదటి వన్డేలో 2 ఓవర్లు వేసిన రాయుడు 13 పరుగులు సమర్పించుకున్నాడు.