ఇప్పుడు ఏమి చేయలేం.. అని కొట్టేశారు..!

పోలవరం కోసం విభజనలో భాగంగా తెలంగాణలోని ఏడు ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను ఇచ్చింది. అయితే, ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగ సవరణ చేయకుండా ముంపు మండలాలను ఏపీలో కలపడం కుదరదని పిటిషనర్ తరపు న్యాయవాది జంద్యాల రవిశంకర్ వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 కి విరుద్దమని వాదించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు సోమవారం దానిని కొట్టేసింది.

పిటిషన్‌పై స్పందిస్తూ చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ ప్రస్తుతం ఈ కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటువంటి చర్యలు తీసుకోలేనందువలన కేసును కొట్టేస్తున్నామని జస్టిస్ తెలిపారు.

అయితే, ఇదే విషయంపై మర్రి శశిధర్ రెడ్డి ముందుగా హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఈ పిటిషన్ కొట్టివేయడంతో సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీం కోర్టు కూడా ఈ కేసును కొట్టేసింది.

కాగా, తెలంగాణలోని బూర్గుంపాడు, వెలియరపాడు, కుక్కునూరు, చింతూరు, కూనవరం, వరరామచంద్ర మండలాలను మరియు భద్రాచలం మండలంలోని కొన్ని గ్రామాలను విభజన సమయంలో కేంద్రం ఏపీలో కలిపింది. దీనివల్ల 200 పైచీలుకు గ్రామాల్లో దాదాపు 1.20 లక్షల మంది ఓటర్లు ఏపీలో చేరారు. ఈ విలీనాన్ని ప్రజలు వ్యతిరేకించారు.

leave a reply