సిక్స్ కొడతాననే నమ్మకంతోనే?

న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. కివీస్‌ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ గెలవటానికి చివరి ఓవర్లో 16 పరుగులు చేయాలి. ఆ సమయంలో క్రీజ్ లో దినేష్ కార్తీక్, కృనాల్ పాండ్య ఉన్నారు. అయితే మూడో బంతికి  సింగిల్‌ వచ్చే అవకాశమున్నా దినేశ్‌ కార్తీక్‌ నిరాకరించాడు. భారీ షాట్లు ఆడగలిగే కృనాల్‌ పాండ్యా పిచ్‌ దాటేసి సగం వరకు పరుగెత్తుకుంటూ వచ్చినా.. దినేశ్‌ కార్తీక్‌ వద్దంటూ సింగిల్‌కు నిరాకరించడం చర్చనీయాంశమైంది. దానిపై అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో దినేశ్‌ కార్తీక్‌పై విమర్శలు చేసారు.

తాజాగా దీనిపై కార్తీక్‌ స్పందించాడు. “ఆ సమయంలో నేను, కృనాల్‌ ఒత్తిడిని అధికమించి బాగా బ్యాటింగ్‌ చేస్తున్నాం. లక్ష్యాన్ని పూర్తి చేయగలమనే నమ్మకంతో ఉన్నాం. సింగిల్‌కు తిరస్కరించిన తర్వాత సిక్స్‌ కొట్టగలనని నాకు అనిపించింది. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా ఒత్తిడిలో భారీ షాట్లు ఆడగల నా సామర్థ్యాన్ని నేను నమ్మాలి. కానీ, భాగస్వామిని నమ్మడం కూడా ముఖ్యం. అయితే నేను అనుకున్నట్లుగా సిక్స్ కొట్టలేకపోయా. క్రికెట్‌లో అలాంటివి సర్వ సాధారణం.” అని పేర్కొన్నాడు. ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోవడంతో టీ20 సిరీస్ కివీస్ సొంతమైంది.

leave a reply