కార్తీక్ చేసిన తప్పే కారణం:హర్భజన్‌!

న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ20లో టీమిండియా చివర్లో 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో దినేశ్‌ కార్తీక్‌, కృనాల్‌ పాండ్య  విధ్వంసక బ్యాటింగ్ తో  జట్టును ఆదుకునే ప్రయత్నం చేసారు. అయితే చివరి ఓవర్లో దినేశ్‌ కార్తీక్‌ సింగిల్‌ తీయాల్సిన సమయంలో తీయకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. దీనిపై  టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ మాట్లాడుతూ… కార్తీక్ సింగల్ తీయకపోవడం ముమ్మాటికే తప్పేనని అభిప్రాయపడ్డాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడి సిరీస్‌ చేజార్చుకుంది. అయితే దినేశ్‌ కార్తీక్‌ సింగిల్‌ తీయకపోవడం వల్లే భారత్‌ ఓడిందని అటు అభిమానుల సైతం వేలెత్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హర్భజన్‌ ఈ వివాదంపై స్పందించాడు.

దినేశ్‌ కార్తీక్‌ చేసిన పొరపాటు వల్ల టీమిండియా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఓ జాతీయ ఛానెల్‌తో హర్భజన్ వివరించాడు. ​అతను సింగిల్‌ తీయకపోవడం భారత విజయవకాశాలను దెబ్బతీసింది. ఒక క్రికెటర్ తనపై తనకు నమ్మకం ఉండాలి గాని అది ఎక్కువ కాకూడదన్నాడు. కార్తీక్‌కు తనపై తనకు విశ్వాసం ఉండటం మంచిదే కానీ అదే నమ్మకాన్ని ఇతరులపై కూడా ఉంచాలన్నారు. గతేడాది నిదహాస్‌ ట్రోఫి ఫైనల్లో మ్యాచ్ ను గెలిపించడంతో కార్తీక్‌కు ఫినిషర్‌ ట్యాగ్‌ వచ్చింది. అయితే  అక్కడ బౌలింగ్‌ చేసింది సౌమ్య సర్కార్‌ కానీ, టీమ్‌ సౌతి కాదనే విషయం తెలుసుకోవాలి. అటు కృనాల్‌ కూడా అంతకు ముందు సౌతీ ఓవర్లో 18 పరుగుల రాబట్టాడు. ఆ సింగిల్‌ తీసి కృనాల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే మ్యాచ్ టీమిండియా వశం అయ్యేదేమో అని చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా కార్తీక్‌ చేసిన చిన్న పొరపాటు భారత విజయావకాశాలను దెబ్బతీసింది’ అని పేర్కొన్నాడు.

అంతే కాకుండా ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ ముందు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చేపట్టిన ప్రయోగాలు ఫలించాయన్నాడు. కివీస్‌ సిరీస్‌ కూడా అందులో భాగమే అని, అందుకే స్టార్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలకు విశ్రాంతినిచ్చిందని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు బుమ్రా, చహల్‌లు ఉంటే కివీస్‌ 200 పరుగుల స్కోరును చేసేది కాదన్నాడు.

leave a reply